Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతున్నది. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో క్రితం సెషన్తో పోలిస్తే మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. చివరి వరకే అదే ఊపును కొనసాగించాయి. బ్యాకింగ్ రంగాలకు చెందిన షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు రాణించడంతో సూచీలు మరోసారి ఆల్టైమ్ హైకి చేరాయి. సెన్సెక్స్ ఉదయం 78,094.02 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 78,759.40 పాయింట్ల గరిష్ఠానికి పెరిగి ఆల్టైమ్ హైని తాకింది. చివరకు 620.73 పాయింట్ల లాభంతో 78,674.25 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం లాభాల్లో కొనసాగింది. పాయింట్ల 147.50 లాభంతో 23,868.80 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ తొలిసారిగా రికార్డు స్థాయి వద్ద ముగియడం విశేషం. దాదాపు 1,634 షేర్లు పురోగమించగా.. 1,763 షేర్లు షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లాభాలను నమోదు చేశాయి. అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నష్టపోయాయి. అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బుధవారం నాలుగు శాతం మేర లాభపడ్డాయి. సెక్టార్లలో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, మీడియా, ఎఫ్ఎంసీజీ 0.3 శాతం నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. ఆటో, మెటల్, రియల్టీ 0.7 నుంచి 1.5 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం క్షీణించగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగిసింది.