న్యూఢిల్లీ, జూన్ 28: సెక్యూరిటీల మార్కెట్లో చిన్న మదుపరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. బేసిక్ సర్వీస్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్డీఏ) పరిమితిని శుక్రవారం రూ.10 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.2 లక్షలుగానే ఉండటం గమనార్హం. రెగ్యులర్ డీమ్యాట్ ఖాతాకు మరింత సరళతరమైన వెర్షనే ఈ బీఎస్డీఏ. చిన్న పోర్ట్ఫోలియోలతో ఉన్న మదుపరులపై డీమ్యాట్ చార్జీల భారాన్ని తగ్గించాలని 2012లో దీన్ని సెబీ పరిచయం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని సెబీ తెలియజేసింది.
ఎన్పీఎస్ ఖాతాదారులకు ఉత్సాహం
న్యూఢిల్లీ, జూన్ 28: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాదారుల కోసం T+0 సెటిల్మెంట్ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) అనుమతించింది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఏదైనా సెటిల్మెంట్ రోజున ఉదయం 11 గంటల వరకు ట్రస్టీ బ్యాంక్ ద్వారా ఎన్పీఎస్ విరాళాలు అందినైట్టెతే.. అదే రోజున (T+0) వాటిని పెట్టుబడిగా పెట్టడం జరుగుతుందని, అంతేగాక ఖాతాదారుల నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)కు కూడా దాని ప్రయోజనాన్ని జత చేస్తామని పీఎఫ్ఆర్డీఏ ఓ పక్రటనలో స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ట్రస్టీ బ్యాంక్.. సెటిల్మెంట్ జరిగిన తర్వాతి రోజున (T+1) అందిస్తున్నది.
ఉదాహరణకు సోమవారం పనివేళలు ముగిసేదాకా వచ్చిన విరాళాలు.. మంగళవారం ట్రస్టీ బ్యాంక్ ద్వారా పెట్టుబడులకు వీలుగా అందుతున్నాయి. కానీ ఇకపై విరాళాలు గనుక ఉదయం 11 గంటలలోపు వస్తే.. అదే రోజున ట్రస్టీ బ్యాంక్ అందిస్తుందని పీఎఫ్ఆర్డీఏ తెలియజేసింది. దీంతో పెట్టుబడులు వెంటనే జరిగిపోతాయన్నది. ఇదిలావుంటే ప్రస్తుతం డీ-రెమిట్ విరాళాలను సెటిల్మెంట్ రోజు ఉదయం 9:30లోగా అందితేనే.. అదే రోజున ఇన్వెస్ట్ చేయడం జరుగుతున్నది. దీంతో ఈ సమయాన్ని కూడా ఉదయం 11 గంటలకు పొడిగించారు.