Quant Mutual Fund | ముంబై, జూన్ 27: క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సదరు ఫండ్పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. ఫ్రంట్-రన్నింగ్ కేసు దర్యాప్తు చేస్తుండటమే కారణం. ఈ నేపథ్యంలోనే 3 రోజుల్లో దాదాపు రూ.1,400 కోట్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఇంకా పెట్టుబడులు లేదా సిప్ (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లతో ముందుకెళ్తే నష్టపోతామేమోనన్న భయాలు ఇప్పుడు మెజారిటీ మదుపరులను వెంటాడుతున్నాయి.
ఫ్రంట్-రన్నింగ్ కేసు నేపథ్యంలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ స్కీముల నికర ఆస్తుల విలువ (ఎన్ఏవీ) తరిగిపోతున్నది. బుధవారం ఒక్కరోజే 0.25 శాతం మేర క్షీణించింది. క్వాంట్ హెల్త్కేర్ ఫండ్ ఎన్ఏవీ 0.25 శాతం, స్మాల్ క్యాప్ ఫండ్ 0.52 శాతం, మిడ్ క్యాప్ ఫండ్ 0.17 శాతం చొప్పున పడిపోయాయి. అయినప్పటికీ వివిధ కాలవ్యవధుల్లో ఈక్విటీ కేటగిరీల వ్యాప్తంగా ఇంకా క్వాంట్ మ్యూచువల్ ఫండే అగ్రస్థానంలో ఉన్నది. గత ఐదేండ్లలో సంస్థ స్మాల్ క్యాప్ ఫండ్ దాదాపు 495 శాతం రాబడులను మదుపరులకు అందించింది. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా 348.65 శాతం రిటర్న్స్ను ఇచ్చినట్టు కనిపిస్తున్నది.
ముంబైలోని క్వాంట్ ప్రధాన కార్యాలయంతోపాటు హైదరాబాద్లోగల ఈ వ్యవహారంతో లబ్ధి పొందిన అనుమానితులకు చెందిన చోట్లలో సెబీ సోదాలు నిర్వహించింది. అక్రమ లాభాలను ఆర్జించడానికి సంస్థ నుంచి విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసినవారి మొబైల్స్, కంప్యూటర్లు, ఇతరత్రా డిజిటల్ డివైజ్లను సీజ్ చేసింది. క్వాంట్ డీలర్లలో ఒకరు లేదా జరుగబోయే లావాదేవీకి సంబంధించి క్వాంట్ కుదుర్చుకున్న బ్రోకరేజీ సంస్థల్లో ఏదైనా ఈ అక్రమాలకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
క్వాంట్ మ్యూచువ్ ఫండ్ స్కీముల్లో ఇప్పుడున్న పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్త పెట్టుబడులకు మదుపరులు దూరంగా ఉంటే మంచిదేనన్నారు. సెబీ కూడా ఇంకా ఈ కేసులో ఏమీ తేల్చలేదని ఫైనాన్షియల్ రేడియన్స్ వ్యవస్థాపకుడు రాజేశ్ మినోచా గుర్తుచేస్తున్నారు. నిజానికి క్వాంట్ ఇన్వెస్టింగ్ పద్ధతి చాలా భిన్నంగా ఉందన్న ఆయన.. అయినప్పటికీ పరిమాణాత్మక పెట్టుబడి పద్ధతినే అనుసరిస్తున్నారని, కాబట్టి భవిష్యత్తులో మదుపరులు ఈ ఫండ్ నుంచి మారినా పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదన్నారు.
క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో ఈ ఏడాది మే నెల నాటికి దాదాపు రూ.9,355 కోట్ల నగదు నిల్వలున్నాయి. కంపెనీ నిర్వహణలోని మొత్తం ఈక్విటీ ఆస్తులు ఈ నెల 26 నాటికి రూ.88,270 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఫండ్లో సుమారు 21 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములున్నాయి. ఇందులో 4 స్కీముల పోర్ట్ఫోలియోల్లో రూ.1,000 కోట్లకుపైగానే నగదు నిల్వలున్నాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో అత్యధికంగా రూ.1,607.37 కోట్లున్నాయి. దీని నిర్వహణలోని మొత్తం ఈక్విటీ ఆస్తులు గత నెలాఖరుకల్లా రూ.19,635 కోట్లు. మిగతా 3 స్కీములు.. క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, యాక్టివ్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్.
ఓ కంపెనీలో జరుగబోతున్న భారీ లావాదేవీకి సంబంధించి తనకున్న విశ్వసనీయ సమాచారంతో ఓ బ్రోకర్ ముందుగానే సదరు కంపెనీలో వ్యక్తిగతంగా షేర్ల కొనుగోళ్ల ద్వారా పెట్టుబడులకు దిగడాన్నే ఫ్రంట్-రన్నింగ్ అంటారు. ఉదాహరణకు.. ఓ భారీ పెట్టుబడిదారు ఓ కంపెనీలో పెద్ద ఎత్తున షేర్లను కొనబోతున్నారు. ఈ విషయం ముందుగానే ఓ బ్రోకర్కు తెలిసింది. వ్యక్తిగత లాభాపేక్షతో ఆ బ్రోకర్ సదరు లావాదేవీ కంటే ముందుగానే ఆ కంపెనీకి చెందిన కొన్ని షేర్లను తన ఖాతాలో కొని పెట్టుకుంటే దాన్ని ఫ్రంట్-రన్నింగ్ కేసుగా పరిగణిస్తారు. ఈ వ్యవహారం అంతా కూడా సెబీ నిబంధనలకు విరుద్ధం. అందుకే ఇవి బయటపడినప్పుడు సెబీ దర్యాప్తులకు దిగుతుంది. గతంలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్లలోనూ ఈ కేసులు నమోదయ్యాయి.
సెబీ దర్యాప్తు నేపథ్యంలో మదుపరులు పదేపదే అడిగిన ప్రశ్నలకు ఈ-మెయిల్ ద్వారా క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సమాధానాలిచ్చింది. వాటిని పరిశీలిస్తే..
1.సెబీ దర్యాప్తు ముగిసిందా?
లేదు. కంపెనీ నుంచి డాటాను తీసుకుని పరిశీలిస్తూ ఉన్నది.
2.ఎవరైనా దోషులుగా తేలారా?
లేదు. మాకైతే ఇందుకు సంబంధించి సెబీ నుంచి ఏ సమాచారం రాలేదు.
3.దర్యాప్తు అధికారులు ఎవరైనా మీ కార్యాలయాల్లో ఇంకా ఉన్నారా?
సోదాల అనంతరం అందరూ వెళ్లిపోయారు. ఎవరూ లేరు.
4.ఆఫీసులు ఎప్పట్లాగే నడుస్తున్నాయా?
మాకు ముంబైలో మాత్రమే రెండు ఆఫీసులున్నాయి. ఎప్పట్లాగే అవి నడుస్తున్నాయి.
5. ఇకపైనా మీ కంపెనీ అందించే రాబడులు అత్యుత్తమంగా ఉంటాయా?
పెట్టుబడులపై రాబడులు మార్కెట్ రిస్కులకు లోబడే ఉంటాయి.