SEBI | న్యూఢిల్లీ, జూలై 4: సెక్యూరిటీస్ మార్కెట్లో మదుపరుల ప్రయోజనాల రక్షణార్థం మోసాలను కనిపెట్టి, అరికట్టేందుకు స్టాక్ బ్రోకర్లకు ఓ సంస్థాగత యంత్రాంగాన్ని తప్పనిసరి చేస్తూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గురువారం ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. సవరించిన సెబీ స్టాక్ బ్రోకర్ల రెగ్యులేషన్స్-2024లో భాగంగా ట్రేడింగ్, అంతర్గత కార్యకలాపాల పర్యవేక్షణకు నిఘా వ్యవస్థ, విజిల్-బ్లోయర్ విధానాన్ని పరిచయం చేయడం వంటి సూచనలను ఈ సర్క్యులర్లో మార్కెట్ రెగ్యులేటర్ చేసింది.
మార్కెట్ సమగ్రత, మదుపరుల ప్రయోజనాల రక్షణే ధ్యేయంగా ఈ రెగ్యులేషన్స్ను సవరించిన విషయం తెలిసిందే. కాగా, బ్రోకర్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫోరం (ఐఎస్ఎఫ్) కార్యాచరణ పద్ధతులను అనుసరించే ఈ సూచనలు చేసినట్టు సెబీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక 50వేలకుపైగా యాక్టీవ్ యూనిక్ క్లయింట్ కోడ్స్ (యూసీసీ) ఉన్న బ్రోకర్లు 2025 జనవరి 1కల్లా సెబీ తాజా నిబంధనలను అమల్లోకి తీసుకురావాలి.
2వేలలోపు యూసీసీలున్న బ్రోకర్లు 2026 ఏప్రిల్ 1కల్లా.. 2001 నుంచి 50వేలదాకా యూసీసీలున్న బ్రోకర్లు 2025 ఏప్రిల్ 1కల్లా సెబీ నిబంధనల్ని ఆచరణలో పెట్టాల్సి ఉన్నది. అలాగే క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు ఈ ఏడాది ఆగస్టు 1కల్లా ఈ సర్క్యులర్ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈ సర్క్యులర్ వివరాలను స్టాక్ ఎక్సేంజీలు సైతం తమతమ వెబ్సైట్లలో సెబీ పెట్టాలన్నది.