-స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అమెరికా షార్ట్ సెల్లింగ్ రిసెర్చ్ కంపెనీ హిండెన్బర్గ్, అదానీ గ్రూప్ల మధ్య ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. అదానీ వివాదానికి సంబంధించి ఇండియా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) హిండెన్బర్గ్కు గత నెల 27న 46 పేజీల షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం హిండెన్బర్గ్ వెల్లడించింది. అదానీ స్టాక్స్పై పెట్టుబడుల్లో తాము నిబంధనల్ని ఉల్లంఘించినట్లు సెబీ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిపింది. అయితే, ఈ వివాదంలో కొటక్ బ్యాంక్ ప్రస్తావనను హిండెన్బర్గ్ ఉటంకించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ కిందటేడాది జనవరిలో హిండెన్బర్గ్ బాంబు పేల్చింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. ఈ వివాదంపై దర్యాప్తు చేపడుతున్న సెబీ సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు తాజాగా హిండెన్బర్గ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ స్టాక్స్పై పెట్టుబడుల ద్వారా ఆ కంపెనీ 22.25 మిలియన్ డాలర్ల లాభాలు పొందిందన్నది.
సెబీ షోకాజ్ నోటీసులను హిండెన్బర్గ్ ‘అర్థంపర్ధం లేనివి’గా కొట్టిపారేసింది. ఉద్దేశపూర్వకంగానే సెబీ ఆ నోటీసులను జారీ చేసిందని మండిపడింది. భారత్లోని శక్తిమంతమైన వ్యాపారవేత్తల లోపాలను ఎత్తిచూపే వారిని సెబీ బెదిరింపులకు గురిచేస్తుందని, ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. చిన్న మదుపర్లను రక్షించాల్సిన సెబీ అక్రమాలకు పాల్పడ్డ బడా వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తున్నదని తీవ్రంగా ధ్వజమెత్తింది.
సెబీ ఆరోపించినట్టు అదానీ కంపెనీల షార్ట్ సెల్లింగ్ ప్రక్రియలో తమకు భారీ లాభాలేమీ రాలేదని హిండెన్బర్గ్ ఈ సందర్భంగా వెల్లడించింది. అదానీ షేర్ల షార్టింగ్ ద్వారా 4.1 మిలియన్ డాలర్ల స్థూల ఆదాయం పొందినట్టు, అదానీ అమెరికా బాండ్ల షార్ట్ ద్వారా మరో 31 వేల డాలర్లు లభించినట్లు వెల్లడించింది. ఖర్చులు పోను ఏమీ మిగల్లేదన్నది.
హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై కొటక్ బ్యాంక్ స్పందించింది. ఈ వ్యవహారంతో అసలు సంబంధం లేదని వెల్లడించింది. బ్యాంక్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్కు హిండన్బర్గ్ అసలు క్లయింటే కాదని పేర్కొంది. తమ ఫండ్లో హిండెన్బర్గ్ అసలు ఇన్వెస్టర్ కూడా కాదని స్పష్టంచేసింది. అయినప్పటికీ సంస్థ షేర్లు 4 శాతం నష్టపోయాయి.
సెబీ నోటీసులపై హిండెన్బర్గ్ స్పందిస్తూ ‘కొటక్ బ్యాంక్’ పేరును ప్రస్తావించడం ఇప్పుడు సంచలనంగా మారింది. బిలియనీర్ ఉదయ్ కొటక్ నేతృత్వంలోని కొటక్ బ్యాంక్ విదేశీగడ్డపై ఓ ఫండ్ను ఏర్పాటుచేసినట్లు ఈ సందర్భంగా హిండెన్బర్గ్ వెల్లడించింది. దాన్ని ఉపయోగించుకొని కింగ్డన్ క్యాపిటల్ అనే పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్ను తాము షార్ట్ చేసినట్లు పేర్కొంది. ఇందులో కొటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (కేఎంఐఎల్), కేఐవోఎఫ్ సహకారం ఉన్నట్టు తెలిపింది. అయితే, సెబీ తమకు ఇచ్చిన నోటీసుల్లో ఎక్కడా కొటక్ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన గానీ ప్రస్తావించలేదని మండిపడింది. కేఎంఎల్ఐ అంటూ పొడి అక్షరాలను వాడుతూ, కే-ఇండియా అపర్చునిటీస్ ఫండ్ లిమిటెడ్ అంటూ కొటక్ పేరు బయటకు రాకుండా సెబీ జాగ్రత్తలు తీసుకొన్నట్టు విరుచుకుపడింది.