SBI Card | ఎస్బీఐ క్రెడిట్ కార్డుల లావాదేవీలపై సర్వీస్ చార్జీలు పెరిగాయి. అన్ని రకాల మర్చంట్ ఈఎంఐ లావాదేవీలు, ఆల్ రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మీద ప్రాసెసింగ్ ఫీజు సవరించినట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. ఈ నెల 15 నుంచి సవరించిన చార్జీలు అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. దీని ప్రాకరం అన్ని రకాల రెంట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మీద రూ.99 ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ అప్లికబుల్ టాక్సెస్తోపాటు జీఎస్టీ విధిస్తామని ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్ చెబుతున్నది. ఈ నెల 15 నుంచి అన్ని రకాల మర్చంట్ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు రూ.199 ప్లస్ అప్లికబుల్ టాక్సెస్తోపాటు జీఎస్టీ విధిస్తారు. ఇంతకుముందు రూ.99 ప్లస్ అప్లికబుల్ టాక్సెస్ మాత్రమే విధించే వారు.
సింప్లీ క్లిక్, సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డుతో అమెజాన్.ఇన్పై ఆన్లైన్ షాపింగ్ జరిపిన వారికి ప్రతి లావాదేవీకి 10 రివార్డ్ పాయింట్లు లభిస్తాయని ఎస్బీఐ కార్డు తెలిపింది. పెంచిన రివార్డు పాయింట్లు 2023 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు ఐదు రివార్డు పాయింట్లు మాత్రమే లభించేవి. అపోలో 24X7, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఈజీ డైనర్, లెన్స్కార్ట్ అండ్ నెట్మెడ్స్ వంటి సంస్థల ఆన్లైన్ షాపింగ్ పైనా 10 రివార్డు పాయింట్లు కొనసాగుతాయి.
గత జూన్ నెలాఖరు నాటికి 1.4 కోట్లకు పైగా ఎస్బీఐ కార్డులు జారీ చేసింది. దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీ సంస్థగా నిలిచింది. వరల్డ్ క్లాస్, వాల్యూ యాడెడ్ పేమెంట్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ను ఆఫర్ చేస్తున్నది. ‘మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ 2022’ అవార్డును ఎస్బీఐ కార్డు గెలుచుకున్నది. ఈ అవార్డును ఎస్బీఐ కార్డు గెలుచుకోవడం ఇది 14వ సారి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఎస్బీఐకార్డ్ 52 శాతం నికర లాభం పెంచుకున్నది. గతేడాది తృతీయ త్రైమాసికంలో రూ.345 కోట్ల నికర లాభం గడించిన ఎస్బీఐ కార్డు.. ఈ ఏడాది రూ.526 కోట్లు సంపాదించింది.