Hyderabad | న్యూఢిల్లీ, జూన్ 20: గత ఏడాది వరకు హైదరాబాద్ ఇండ్ల కోసం ఎగబాడినవారంతా ఇప్పుడు సైలెంటైపోయినట్టు కనిపిస్తున్నది. ప్రముఖ రియల్ ఎస్టేట్ డాటా అనలిటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ అంచనాను చూస్తే ఇలాగే అనిపిస్తున్నది మరి. 10 రోజుల ముందుగానే ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలపై ప్రాప్ఈక్విటీ ఓ నివేదికను తెచ్చింది. గురువారం విడుదలైన ఈ రిపోర్టు ప్రకారం ఈ నెలాఖరుతో ముగిసే 3 నెలల కాలంలో గతంతో పోల్చితే హైదరాబాద్లో హౌజింగ్ సేల్స్ భారీగానే తగ్గిపోతాయన్న సంకేతాలు వస్తున్నాయి. నిరుడు ఏప్రిల్-జూన్లో నగరంలో నమోదైన ఇండ్ల అమ్మకాలు 18,757 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఈసారి 15,016 యూనిట్లకే పరిమితం కావచ్చని ప్రాప్ఈక్విటీ లెక్కలు చెప్తున్నాయి. విక్రయాలు 3,741 యూనిట్ల మేరకు తగ్గుతాయని అంటున్నది. ఇది 20 శాతానికి సమానం.
ఇండ్ల అమ్మకాలపై ప్రాప్ఈక్విటీ పరిగణనలోకి తీసుకున్న నగరాల్లో ఒక్క హైదరాబాద్లోనే అత్యధికంగా డిమాండ్ పడిపోతున్నట్టు తేలడం గమనార్హం. నిజానికి ఎప్పుడూ హైదరాబాద్లో నివాసాలకు కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తునే ఆసక్తి కనిపించేది. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా అంచనాలుండటం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇది మరింత హాట్ టాపిక్గా మారుతున్నది. నిజానికి గత పదేండ్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి పెద్దపీట వేసింది. దీనికి తగ్గట్టుగానే మౌలిక వసతులను కల్పిస్తూ అనుబంధ రంగాలనూ ప్రోత్సహించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే నాటి ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్య లూ కలిసొచ్చాయి. బడా సంస్థల రాకతో ఇండ్లకు డిమాండ్ ఏర్ప డింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైనా.. రియల్టీపై ఫోకస్ పెట్టకపోవడమే ఇండ్ల అమ్మకాలను దెబ్బతీస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.