RBI | ముంబై, జూలై 1: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. మలేషియా, సింగపూర్సహా నాలుగు ఆసియా దేశాలు కలిసి వేగవంతమైన రిటైల్ పేమెంట్స్ కోసం ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 2026లో ఇది అందుబాటులోకి రావచ్చన్న అంచనాలున్నాయి. దేశీయ ఫాస్ట్ పేమెంట్స్ సిస్టమ్స్ (ఎఫ్పీఎస్) ఇంటర్లింకింగ్ ద్వారా ఓ ఇన్స్టంట్ క్రాస్-బార్డర్ రిటైల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ అభివృద్ధికి బహుళజాతి ఆలోచన ప్రాజెక్ట్ అయిన నెక్సస్లో భాగస్వామ్యమైనట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) ఇన్నోవేషన్ హబ్ కాన్సెప్టే ఈ నెక్సస్. దీని ద్వారా తొలుత భారత్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ దేశాల ఎఫ్పీఎస్ల అనుసంధానం జరుగుతుందని ఆర్బీఐ వివరించింది. ఈ మేరకు జరిగిన ఒప్పందంపై స్విట్జర్లాండ్లోని బాసెల్లో ఆర్బీఐతోపాటు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు, బీఐఎస్ సంతకాలు చేశాయి. మున్ముందు మరిన్ని దేశాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతాయని ఆర్బీఐ చెప్పింది.
రూ.2వేల నోట్లు పూర్తిగా తిరిగి బ్యాంకుల్లోకి రాలేదని ఆర్బీఐ సోమవారం తెలిపింది. ఇప్పటిదాకా 97.87 శాతం వచ్చినట్టు వివరించింది. ఇంకా రూ.7,581 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది. గత ఏడాది మే 19న రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు వీటి విలువ రూ.3.56 లక్షల కోట్లుగా ఉన్నది. అయితే జూన్ 28 నాటికి ఇది రూ.7,581 కోట్లకు పడిపోయినట్టు ఆర్బీఐ తెలిపింది. దీంతో 97.87 శాతం రూ.2వేల నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చేశాయని పేర్కొన్నది. ఈ పెద్ద నోట్ల మార్పిడికి ప్రస్తుతం హైదరాబాద్సహా దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీలు కల్పించారు. 2016 నవంబర్లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో ఈ రూ.2000 నోట్లు పరిచయమైన సంగతి విదితమే.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఆర్నాబ్ కుమార్ చౌధరి, చారులతా ఎస్ కార్లను నియమించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఇరువురూ మూడేసి శాఖలను పర్యవేక్షిస్తారని కూడా ప్రకటించింది. కార్ నియామకం సోమవారం నుంచే అమల్లోకి రాగా, చౌధరి నియామకం మాత్రం జూన్ 3 నుంచే వర్తిస్తుంది.