Reliance | కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) షేర్ శుక్రవారం రెండు శాతానికి పైగా వృద్ధి చెందింది. దీంతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21.5 లక్షల కోట్ల పై చిలుకు నమోదైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో రిలయన్స్ షేర్ 2.63 శాతం పుంజుకుని రూ.3,189.90 లకు చేరుకున్నది. అంతకుముందు ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.3,197 వద్ద వరకూ దూసుకెళ్లింది. మరోవైపు బీఎస్ఈలో 2.86 శాతం వృద్ధి చెంది రూ.3,180.05 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.55,286.61 కోట్లు పెరిగి రూ.21,58,227.12 కోట్లకు పెరిగింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,82,498.05 కోట్లకు చేరుకున్నది. ఎన్ఎస్ఈలో 61.35 లక్షల షేర్లు చేతులు మారితే, బీఎస్ఈలో 7.59 లక్షల స్టాక్స్ చేతులు మారాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 21.70 పాయింట్ల లబ్ధితో జీవితకాల గరిష్టం 24,323.85 వద్ద ముగిసింది. కానీ బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 53.07 పాయింట్ల పతనంతో 79,996.60 పాయింట్లతో సరి పెట్టుకున్నది. ఇక ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రం, లైసెన్సు ఫీజుకు అనుగుణంగా రిలయన్స్ జియో హయ్యెస్ట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రూ.25,307.97 కోట్లు అని ట్రాయ్ తెలిపింది. 2024-25 సంవత్సరం తొలి త్రైమాసికంలో జియో సర్దుబాటు ఆదాయం 10.21 శాతం వృద్ధి చెందింది. 2023-24 జనవరి – మార్చి త్రైమాసికంలో జియో స్థూల ఆదాయం రూ.22,985 కోట్లు మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరి 13న రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట్లు దాటిన తొలి కార్పొరేట్ సంస్థగా రికార్డు నెలకొల్పింది.