న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)తోపాటు దాని ప్రమోటర్, ఎండీ పార్థసారథిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరఢా ఝుళిపించింది. ఏడేండ్లపాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధం విధించింది. అంతేగాక రూ.21 కోట్ల జరిమానా వేసింది. ఇందులో రూ.13 కోట్లు కేఎస్బీఎల్పై, రూ.8 కోట్లు పార్థసారథిపై వేస్తూ నిర్ణయం తీసుకున్నది. క్లెయింట్స్ తమకిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని వాడుకుని వారి ఫండ్స్ను దుర్వినియోగం చేసినందుకుగాను కార్వీ, దాని ప్రమోటర్కు ఈ నిషేధం, జరిమానా పడింది.
క్లెయింట్ల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి అక్రమంగా సమీకరించిన నిధులను కేఎస్బీఎల్.. దాని గ్రూప్ సంస్థలైన కార్వీ రియల్టీ లిమిటెడ్, కార్వీ క్యాపిటల్ లిమిటెడ్కు మళ్లించిందని సెబీ తమ తుది ఆదేశంలో తెలియజేసింది. ఇదిలావుంటే స్టాక్ మార్కెట్లలో నమోదైన ఏ కంపెనీలోనైనాసరే కీలక పదవుల్లో ఉండరాదంటూ, ఏ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీతోనూ పనిచేయరాదంటూ పార్థసారథిపై పదేండ్ల ఆంక్షలు పెట్టింది. కేఎస్బీఎల్ అప్పటి డైరెక్టర్లు భగవాన్ దాస్ నారం గ్, జ్యోతీ ప్రసాద్లపైనా రెండేండ్ల ఆంక్షలు, రూ.5 లక్షల చొప్పున ఫైన్ విధించింది.
3 నెలల్లో కట్టాలి
కేఎస్బీఎల్ నుంచి అక్రమంగా అందుకున్న రూ.1,442.95 కోట్లను కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్ తిరిగిచ్చేయాలని తమ 88 పేజీల తాజా ఆర్డర్లో సెబీ ఆదేశించింది. మూడు నెలల్లోగా ఈ నిధులను కేఎస్బీఎల్కు పంపకపోతే సదరు సొమ్మును రాబట్టేందుకు ఎన్ఎస్ఈ ఆ సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని కూడా స్పష్టం చేసింది.