న్యూఢిల్లీ, జూలై 1: యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (పీఏఎల్)కు చెందిన హోం, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని తమ సొంతం చేసుకున్నట్టు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. ఈ అంతర్గత లావాదేవీ విలువ రూ.1,100 కోట్లుగా పేర్కొన్నది. ఐదు విడుతల్లో ఈ చెల్లింపులు జరుగుతాయి. కంపెనీ వాటాదారులు, రుణదాతల ఆమోదానికి లోబడి ఈ లావాదేవీ ఉంటుంది. అలాగే దీనికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం రావాల్సి ఉన్నది.
ప్రధాన ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదగడానికే ఈ డీల్కు దిగినట్టు దేశీయ వంటనూనెల తయారీ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా ఉన్న పతంజలి ఫుడ్స్ సంస్థ తెలిపింది. కాగా, ప్రస్తుతం పతంజలి ఫుడ్స్ ప్రమోటర్లలో పీఏఎల్ కూడా ఒకటిగా ఉన్నది. ఇక ఈ డీల్తో హెయిర్ కేర్, స్కిన్ కేర్, డెంటల్ కేర్, హోం కేర్ వ్యాపార విభాగాలు పతంజలి ఫుడ్స్ కిందకు వస్తాయి. ఈ డీల్ ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరుకల్లా పూర్తవగలదన్న ఆశాభావాన్ని పతంజలి ఫుడ్స్ సీఈవో సంజీవ్ ఆస్తానా వ్యక్తం చేశారు.