న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న ఆ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలకు జీతాల్లేవు. అయితే బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు ఫీజులు మాత్రం చెల్లిస్తారు. అలాగే సంస్థ లాభాలపై కమీషన్నూ తీసుకుంటారు. 2014లో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమితులైన ముకేశ్ భార్య నీతా అంబానీ ఎలాగైతే తీసుకున్నారో అలాగే ఈ ముగ్గురూ తీసుకోనున్నారు. ఈ మేరకు ముకేశ్ సంతానమైన ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలను ఆర్ఐఎల్ బోర్డ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఇచ్చిన తీర్మానంలో ఆ సంస్థ పేర్కొన్నది. ఇప్పటికే 2020-21 నుంచి ముకేశ్ అంబానీ జీతం తీసుకోకుండా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం 2008-09 నుంచి 2019-20 వరకు ఏటా రూ.15 కోట్లు తీసుకుంటూ వచ్చారు. కానీ కరోనా నేపథ్యంలో 2020-21 నుంచి జీతాన్ని తీసుకోబోనని ప్రకటించారు. ఆర్ఐఎల్ గ్రూప్లోని అన్ని వ్యాపారాలు పూర్తిస్థాయిలో లాభాలను సంతరించుకునేదాకా ఇంతేనని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ముకేశ్ పిల్లలూ జీతాలు తీసుకోబోవడం లేదు.
అయితే ఆర్ఐఎల్ బోర్డులోని ముకేశ్ సమీప బంధువులు నిఖిల్, హితల్ (అన్నీ కలుపుకొని వీరికి మాత్రం ఏటా రూ.25 కోట్ల చొప్పున జీతం) సహా మిగతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లందరూ వారి స్థాయికి తగ్గ జీతం, అలవెన్సులు, కమీషన్ ఇతరత్రా తీసుకుంటున్నారు. ఇక 2022-23కుగాను నీతా అంబానీ రూ.6 లక్షల ఫీజు, రూ.2 కోట్ల కమీషన్ పొందినట్టు తాజా వార్షిక నివేదికలో ఆర్ఐఎల్ పేర్కొన్న సంగతి విదితమే. ఇలాగే బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్లందరికీ రూ.2 కోట్ల కమీషన్, ఫీజులు అందుతున్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో సంస్థ బోర్డులోకి వచ్చిన కేవీ కామత్కు ఒక్కో సమావేశానికి రూ.3 లక్షలు, కమీషన్ రూ.39 లక్షలు ఇస్తున్నారు. గత నెల జరిగిన ఆర్ఐఎల్ వార్షిక వాటాదారుల సమావేశంలో కంపెనీ బోర్డులోకి డైరెక్టర్లుగా ఆకాశ్, ఇషా, అనంత్ వస్తున్నట్టు ముకేశ్ ప్రకటించినది తెలిసిందే. అలాగే మరో ఐదేండ్లు తాను సంస్థ చైర్మన్గా, సీఈవోగా ఉంటానన్నదీ విదితమే. కాగా, ఆర్ఐఎల్లోని ఆయిల్, టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలకు మాత్రమే బోర్డులున్నాయి.