Mercedes-Benz | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా (Mercedes Benz India) పై మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుణెలోని మెర్సిడెజ్ బెంచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ‘నాన్ కంప్లియెన్స్’, ‘పర్యావరణ ప్రమాణాలు’ పాటించడం లేదని ఆరోపించింది. ఈ ప్లాంట్ నిర్వహణపై సమగ్ర సమీక్ష జరుపాలని అధికారులను ఆదేశించింది. అయితే తమకు నిబంధనల ఉల్లంఘన విషయమై మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) నుంచి ఎటువంటి రాతపూర్వక నోటీసు గానీ, సూత్రప్రాయ సూచన గానీ రాలేదని మెర్సిడెజ్ బెంచ్ పేర్కొంది. అవసరమైతే ఎటువంటి చర్యలు చేపట్టేందుకైనా సిద్ధమేనని పేర్కొంది.
శుక్రవారం పుణె మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను తనికీ చేసిన తర్వాత ‘మార్గదర్శకాల ఉల్లంఘన’ జరుగుతున్నదని ఎంపీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. చకాన్ లోని మెర్సిడెజ్ బెంజ్ అసెంబ్లింగ్ యూనిట్ లో కాలుష్య నియంత్రణ మార్గదర్శకాల అమలు విషయంలో తగు చర్యలు తీసుకోవాలని తమ ప్రాంతీయ అధికారిని ఎంపీసీబీ ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు మెర్సిడెజ్ బెంచ్ ఇచ్చిన రూ.25 లక్షల బ్యాంక్ గ్యారంటీని జప్తు చేస్తున్నట్లు తెలిపింది. అయితే తాము కార్ల తయారీలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేస్తామని పేర్కొంది.