Minister Sridhar Babu | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీని గురువారం ప్రత్యేకంగా భేటీ అయి ఆదుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో లక్ష మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణతోపాటు ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర సర్కార్ ప్రారంభించిన యశస్వని పథకం కింద తెలంగాణ రాష్ర్టానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.
మరోవైపు, మహిళా ఔత్సాహికులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ప్రైజెస్ (నిమ్స్మే)కు మరిన్ని నిధులు కేటాయించాలని, అలాగే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఆధునీకరించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల ద్వారా 3.64 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వీరికి ఐటీ, కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సులో ఇంజినీరింగ్, డిప్లొమా పట్టా కోసం ప్రత్యేకంగా నూతన శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.