హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. డాటా సెంటర్ల విస్తరణ పనులు వచ్చే ఏడాదినాటికి పూర్తి చేయాలని తనను కలిసిన మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ భారీ విస్తరణ ప్రణాళిక పూర్తైతే అత్యాధునిక డాటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యుషన్ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
హైదరాబాద్లోని మేకగూడ వద్ద 22 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయతలపెట్టిన డాటా సెంటర్ భూ సేకరణకు సంబంధించి పలు సమస్యలు తలెత్తాయని కంపెనీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కే శశాంకను ఆదేశించారు.