Mercedes-Benz | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా.. మూడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు దేశీయ మార్కెట్లో 12 కొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. వాటిలో 50 శాతానికి పైగా టాప్ ఎండ్ వెహికల్ క్యాటగిరీ (ఆయా కార్ల ధరలు రూ.1.5 కోట్లు) లోనే ఉంటాయని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ లాన్స్ బెన్నెట్ తెలిపారు.
గతంతో పోలిస్తే 2023లో లగ్జరీ కార్లకు గిరాకీ పెరిగింది. గతేడాది రికార్డు స్థాయిలో 17,408 కార్లను విక్రయించింది మెర్సిడెజ్ బెంజ్. 2023 కార్ల విక్రయాల్లో మెర్సిడెజ్ 10 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. ఈ నేపథ్యంలో లగ్జరీ కార్ల తయారీపై కేంద్రీకరించామని పేర్కొన్నారు లాన్స్ బెన్నెట్. ఇందుకోసం పుణెలోని తమ ఫ్యాక్టరీ డెవలప్ మెంట్ కోసం రూ.200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. దీంతో భారత్లో మెర్సిడెజ్ బెంజ్ పెట్టుబడులు రూ.3000 కోట్లకు చేరతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు.
2022లో 15,822 యూనిట్లు, 2023లో 17,408 కార్ల విక్రయంతో మెర్సిడెజ్ బెంజ్ ఇండియా జోరు మీద ఉన్నది. సప్లయ్ అండ్ డిమాండ్లో ఒడిదొడుకులు ఉన్నా, ఈ ఏడాది డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. గతేడాది మొత్తం కార్ల విక్రయాల్లో ఈవీ కార్ల వాటా నాలుగు శాతం.