Market Capitalisation | గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడే ట్రేడింగ్లో ఆల్ టైం గరిష్టానికి చేరుకోవడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లోనూ సరికొత్త రికార్డు నమోదైంది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ గురువారం ప్రారంభంలో అంతర్గత ట్రేడింగ్లో 80,392.64 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. అటుపై అనిశ్చిత పరిస్థితులతోపాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సెన్సెక్స్ 62.87 పాయింట్ల లబ్ధితో 80,049.67 పాయింట్ల వద్ద స్థిర పడింది. తత్ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,47,30,452.99 కోట్లకు చేరుకున్నది. దీని విలువ 5.36 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. బీఎస్ఈ-30 ఇండెక్సులోని 4021 స్టాక్స్ లో 2,185 స్టాక్స్ లాభాలు గడిస్తే, 1742 స్క్రిప్ట్లు నష్టాల్లో ముగిశాయి. మరో 94 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.
‘అమెరికా ఎకనమిక్ డేటా బలహీనంగా ఉండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య గురువారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు గరిష్ట మార్కును దాటాయి. ప్రారంభంలో గరిష్ట లాభాలతో ఇండెక్సులు దూసుకెళ్లినా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టాల ప్రభావంతో టెక్నాలజీ స్టాక్స్ లాభాలకు గండికొట్టాయి ’ అని స్టాక్స్ బాక్స్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ అనలిస్ట్ అవ్ధుత్ బాగ్కర్ పేర్కొన్నారు. ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా ముగిశాయి.
బ్రాడర్ మార్కెట్లో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.60 శాతం లాభాలతో స్థిర పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో చారిత్రక 80 వేల పాయింట్ల జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం ఇంట్రాడే ట్రేడింగ్ లో 162 పాయింట్లకు పైగా పుంజుకుని 24,286.50 పాయింట్ల ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 24,302.15 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ పై రూపాయి మారకం విలువ రూ.83.50 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు గురువారం 86.79 డాలర్లు పలికింది.