Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమై.. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇంట్రాడే ట్రేడింగ్లో ఇండెక్సులు 0.6 శాతం నష్టపోయినా, చివరకు రిలయన్స్ అండతో రికవరీ సాధించి ఫ్లాట్గా ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 79,479 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 53 పాయింట్ల నష్టంతో 79,997 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 24,169 పాయింట్ల కనిష్టానికి పడిపోయి ట్రేడింగ్ ముగిసే సమయానికి 21 పాయింట్ల పతనంతో 24,324 పాయింట్ల వద్ద ముగిసింది. త్వరలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం జియో ఐపీఓకు వెళ్లనుండటంతో రిలయన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇన్వెస్టర్లకు కలిసి వచ్చింది.
రిలయన్స్ 2.58 శాతం పుంజుకోవడంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రికవరీ సాధించాయి. ఎస్బీఐ 2.5, ఎన్టీపీసీ 1.9, హెచ్ యూఎల్ 1.89, ఎల్ అండ్ టీ 1.3, నెస్లే ఇండియా 1.2 శాతం లాభ పడ్డాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.4 శాతం, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలకు భిన్నంగా బ్రాడర్ మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఇంట్రాడే ట్రేడింగ్లో రికార్డు గరిష్టాలకు దూసుకెళ్లి 0.7 శాతం చొప్పున లబ్ధి పొందాయి.
మరోవైపు నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్, బ్యాంక్ ఇండెక్సులు ఒక శాతం చొప్పున నష్టపోగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్యూ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభ పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 87.30 డాలర్లు, ఔన్స్ బంగారం 2371 డాలర్లు పలికాయి.