Credit Card Rules | ఇప్పటి వరకూ క్రెడిట్ కార్డుల వాడకంపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు పలు బెనిఫిట్లు లభిస్తున్నాయి. కానీ ప్రస్తుతం బ్యాంకులన్నీ ఈ బెనిఫిట్లలో పలు సవరణలు చేశాయి. ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సిటీ బ్యాంకుల క్రెడిట్ కార్డుల వాడకంలో బెనిఫిట్లలో మార్పులు చేస్తూ తెచ్చిన నిబంధనలు జూలై నుంచి అమల్లోకి రానున్నాయి.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధ ఆర్థిక లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఉండవు. కొన్ని కార్డులపై జూలై ఒకటో తేదీ నుంచి, మరికొన్ని కార్డులపై జూలై 15 నుంచి అమల్లోకి వస్తాయి.
ఎమరాల్డ్ కార్డు మినహా ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిట్ కార్డుల రీప్లేస్ మెంట్ చార్జీలు రూ.100 నుంచి రూ.200లకు పెంచేసింది. చెక్ లేదా క్యాష్ పికప్ ఫీజు, స్లిప్ రిక్వెస్ట్, డయట్ ఏ డ్రాఫ్ట్ లావాదేవీ చార్జీ, ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ తదితరాలపై చార్జీలు తొలగించింది. ఈ నిర్ణయం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది.
దేశంలోని ప్రైవేట్ బ్యాంక్ ‘సిటీ బ్యాంకు’ లావాదేవీలను యాక్సిస్ బ్యాంక్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులన్నీ జూలై 15 నాటికి యాక్సిస్ బ్యాంకులో విలీనమవుతాయి. వాటి స్థానే కొత్తగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు జారీ చేసే వరకూ సిటీ బ్యాంకు కార్డులు పని చేస్తాయి. అలాగే తమ బ్యాంకులో సిటీ బ్యాంకు విలీనమయ్యే వరకూ ఆయా క్రెడిట్ కార్డులపై ఉన్న రివార్డు పాయింట్లు ఎప్పటికీ ఎక్స్ పైర్ కావని, మైగ్రేషన్ తర్వాత మూడేండ్లకే రివార్డు పాయింట్లు ఎక్స్ పైర్ అవుతాయని తెలిపింది యాక్సిస్ బ్యాంక్.
ఇక మరో ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన క్రెడిట్ కార్డును ఉపయోగించి క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా జరిపే రెంట్ చెల్లింపులపై చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. రెంట్ పేమెంట్ మీద ఒక శాతం చార్జీ వసూలు చేయనున్నది. ఈ నిర్ణయం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది.