PM Modi | హైదరాబాద్, జూన్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రానున్న ఐదేండ్లలో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే తన లక్ష్యమని లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఊదరగొట్టారు. భారత్ మెరుగైన వృద్ధిరేటుతో దూసుకుపోతున్నదని కేంద్రప్రభుత్వ ఏజెన్సీలూ గతకొంతకాలంగా ప్రచారం చేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 8 శాతం వరకు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే, ఎవరెన్ని చెప్పినప్పటికీ, దేశంలో ఆర్థిక అసమానతలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు, మేధావులు తేల్చిచెప్తున్నారు.
స్టాక్మార్కెట్ల సూచీలు, జీడీపీ వృద్ధిరేటును చూసి పేదలు, మధ్యతరగతి వర్గాలకు లాభం చేకూరుతుందని అనుకొంటే అది పొరపాటేనని చెబుతున్నారు. రానున్న ఐదేండ్ల మోదీ ప్రభుత్వ హయాంలో పేదలకు కొత్తగా ఒరగబోయేది ఏమీ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో.. ఇప్పటికీ 80 కోట్ల మందికి ఉచిత బియ్యం సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ‘రాయిటర్స్’ సంస్థ మే 15-జూన్ 18 మధ్య నిర్వహించిన పోల్లో వెల్లడైంది. పోల్లో పాల్గొన్న మొత్తం 51 మంది ఆర్థికవేత్తల్లో .. ఏకంగా 43 మంది రానున్న ఐదేండ్లలో మోదీ హయాంలో దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గే అవకాశమే లేదని, పేదల కష్టాలు తీరబోవని తేల్చిచెప్పడం గమనార్హం.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రాకపోవడానికి కారణాలను కూడా ఆర్థికవేత్తలు విశ్లేషించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, పెచ్చరిల్లిన నిరుద్యోగమే దీనికి కారణంగా వివరించారు. 2047లోగా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తానని ప్రధాని అంటున్నారని, అయితే, నైపుణ్యం కలిగిన మానవ వనరులను పెంచడం, నిరుద్యోగాన్ని రూపుమాపడం, సమ్మిళిత వృద్ధితోనే ఇది సాధ్యమౌతుందని ఆర్థిక నిపుణులు సూచించారు. దేశ ఆర్థిక ప్రగతికి నిరుద్యోగమే పెద్ద సమస్యగా మారిందని పోల్లో పాల్గొన్న 90 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న విధానపరమైన నిర్ణయాలతో మధ్యతరగతి వర్గాల నడ్డివిరుగుతున్నది. ఉచితాల కోసం పేదలు ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడే దుస్థితి దాపురించింది. అయితే, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, చేయూతతో ధనికులు మరింత సంపన్నులుగా మారుతున్నారు.
– సాయిబాల్కర్, ప్రొఫెసర్, సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్