Jio Book Laptop | రిలయన్స్ జియో త్వరలో న్యూ జియోబుక్ లాప్టాప్ ఆవిష్కరించనున్నది. ఈ నెల 31న జియోబుక్ (Jio Book) దేశీయ మార్కెట్లోకి రానున్నదని ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ వెల్లడించింది. ఆవిష్కరణ తేదీతోపాటు ఎంత ధరకు అందుబాటులోకి వస్తుందన్న విషయమై కూడా అమెజాన్ టీజ్ చేసింది. అయితే రిలయన్స్ జియో మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ లాప్టాప్ను ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ వంటి అవసరాలకు డిజైన్ చేశారు.
4జీ కనెక్టివిటీ గల జియోబుక్ లాప్టాప్.. పెర్పార్మెన్స్ కోసం ఒక్టాకోర్ ప్రాసెసర్ వినియోగిస్తున్నారు. హై-డెఫినేషన్ వీడియో స్ట్రీమింగ్, మల్టీ టాస్కింగ్కు ఉపకరిస్తుంది. గతేడాది అక్టోబర్లో మార్కెట్లో ఆవిష్కరించిన జియోబుక్ లాప్టాప్లోని డిజైన్లే న్యూ జనరేషన్ జియోబుక్ లాప్టాప్లో ఉంటాయి. దీని ధర రూ.20 వేల లోపు ఉండొచ్చునని అంచనా. ఫస్ట్ జనరేషన్ జియో బుక్ రూ.15,799లకే అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్ జియో.
గతేడాది మార్కెట్లోకి విడుదల చేసిన ఫస్ట్ జన్ జియోబుక్ లాప్టాప్ 11.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంటుంది. నలువైపులా వైడ్ బెజెల్స్తోపాటు వీడియో కాలింగ్ కోసం 2-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 2 జీబీ రామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్తో వచ్చింది. దీని ఇంటర్నల్ స్టోరేజీ 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 8 గంటలపాటు బ్యాటరీ సపోర్ట్ ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూ టూత్ 5.0, మినీ హెచ్డీఎఫ్ఐ, వై-ఫై కనెక్టివిటీ ఉంటుంది.