హైదరాబాద్, జూలై 2: దేశీయ టెలికం దిగ్గజాలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు రీచార్జి ప్లాన్ల ధరలను పెంచుతూ టెలికం కస్టమర్లకు షాకిచ్చిన విషయం తెలిసిందే. గతవారంలో జియో తన ప్లాన్ల ధరలను 10 శాతం నుంచి 21 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా ప్లాన్ల ధరలను 25 శాతం వరకు సవరించాయి. అయితే చార్జీలు పెంచిన తర్వాత జియో ప్లాన్లే చౌక ధరకు లభిస్తుండటం విశేషం.
ఉదాహరణకు రోజుకు 1 జీబీ డాటా, అన్లిమిటెడ్ ప్లాన్ ధర రూ.249 కాగా, అదే ఎయిర్టెల్/వొడాఫోన్ ఐడియాలు రూ.299కి అందిస్తున్నాయి. అంటే 20 శాతం తక్కువ ధరకే లభిస్తుండటంతో రూ.50 ఆదా కానున్నది. అలాగే రోజుకు 2 జీబీ డాటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియో రూ.249కి అందిస్తుండగా, ఎయిర్టెల్/వొడాఫోన్ ఐడియాలు రూ.379గా ఉన్నది. జియో కస్టమర్లు 9 శాతం తక్కువ ధరకే ఈ ప్లాన్ లభిస్తుండటం విశేషం.
మరోవైపు, మూడు నెలల ప్లాన్ విషయానికి వస్తే 6జీబీ డాటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ను జియో రూ.479కి అందిస్తుండగా, అదే ఎయిర్టెల్/వొడాఫోన్ ఐడియాలు ఆరు శాతం అధికంగా రూ.509కి అందిస్తున్నాయి. రోజుకు 1.5 జీబీ డాటా ప్లాన్ జియో ధర రూ.799 ఉండగా, అదే పోటీ సంస్థలైన ప్లాన్లు 8 శాతం ఎక్కువగా రూ.859కి అందిస్తున్నాయి.