న్యూఢిల్లీ, జూన్ 25: పరోక్ష పన్నులను తగ్గించాలని, సుంకాల నిర్మాణాన్ని హేతుబద్ధం చేయాలని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, సంఘాల నాయకులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ముందస్తు బడ్జెట్ చర్చల్లో భాగంగా మంగళవారం మంత్రితో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అధ్యక్షుడు అశ్వినీ కుమార్.. వచ్చే ఐదేండ్లకుగాను ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీంను పొడిగించాలని కోరారు. ఈ స్కీం ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అలాగే రాబోయే బడ్జెట్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని పొడిగించాలని దేశీయ తోలు, పాదరక్షల ఎగుమతిదారులు కోరుతున్నారు.
బంగారం, వెండి, ప్లాటినం కడ్డీలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేస్తున్నది. వచ్చే బడ్జెట్లో 4 శాతానికి దించాలని కోరింది. ప్రస్తుతం 15 శాతం పడుతున్నది. ఇక ఎగుమతులు పెరిగేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రత్యేక నోటిఫైడ్ జోన్లలో ముడి వజ్రాల అమ్మకాలకూ అనుమతివ్వాలని మండలి విజ్ఞప్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను వచ్చే నెల పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు.
అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతమున్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాలను నిలిపేయాలని కూడా కోరుతున్నాయి. నిధుల సమీకరణ కోసం ప్రధాన ఆహారోత్పత్తులు, ఔషధాలపై జీఎస్టీ ఇతరత్రా పన్నులు, సెస్సుల భారం వేయకుండా.. కార్పొరేట్ ట్యాక్స్, సంపద పన్నులను పెంచాలని, వారసత్వ పన్నును తీసుకురావాలని యూనియన్ నాయకులు సూచిస్తున్నారు. బీఎంఎస్ ప్రత్యేకంగా తమ డిమాండ్లతో ఓ మెమరాండాన్ని సమర్పించింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద ప్రతీ కుటుంబానికి ఏటా 200 రోజుల పని కల్పించాలని, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల పనులనూ ఈ చట్టం కిందకు తీసుకురావాలని కోరింది. 60 ఏండ్లు దాటినవారందరికీ ఆరోగ్య ప్రయోజనాలను సమకూర్చాలని, నెలకు రూ.100 టోకెన్ అమౌంట్తో రూ.5 లక్షల వార్షిక బీమా కవరేజీనివ్వాలన్నది. ఆయుష్మాన్ భారత్ స్కీం పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలన్నది.