Poonam Gupta | న్యూఢిల్లీ, జూలై 3: భారత్.. అధిక రుణ భారాన్ని ఎదుర్కొంటున్నదని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా అన్నారు. దేశ జీడీపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దాదాపు 82 శాతంగా ఉన్నట్టు చెప్పారు. అయితే చాలావరకు రుణాలు స్థానిక కరెన్సీ అయిన రూపాయల్లోనే ఉండటం, దేశ వృద్ధిరేటు కూడా ఆకర్షణీయంగా ఉన్న కారణంగా ఇప్పటికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎన్సీఏఈఆర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గుప్తా మాట్లాడుతూ.. మొత్తం అప్పుల్లో మూడింటా ఒక వంతు రాష్ర్టాలవని చెప్పారు. రాబోయే ఐదేండ్లలో రుణ భారం మరింతగా పెరిగేందుకు వీలుందన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటం వల్ల రాష్ర్టాలపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చన్నారు.
సాధ్యం కాని హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తున్న వివిధ పార్టీల వల్లే రాష్ర్టాల అప్పులు ఇంతలా పెరుగుతూపోతున్నాయని తక్షశిల ఇన్స్టిట్యూషన్ కౌన్సిలర్ ఎం గోవింద రావు ఈ సందర్భంగా అభిప్రాయపడటం గమనార్హం. గత ఏడాది ఆఖర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సైతం పెద్ద ఎత్తున సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, రుణ మాఫీ హామీలతోనే అధికారంలోకి వచ్చినది తెలిసిందే.
ముందుగా చెప్పినట్టుగా ఈ హామీల అమలుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా.. తీవ్రం గా వేధిస్తున్న నిధుల కొరతనూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎన్సీఏఈఆర్ చర్చలో పాల్గొన్న గోవింద రావు వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలావుంటే 2022-23 నాటికి పంజాబ్, హిమాచల్ప్రదేశ్, బీహార్ రాష్ర్టాల అప్పులే మిగతా రాష్ర్టాలకన్నా ఎక్కువగా ఉన్నాయి. అయితే మున్ముందు ఈ జాబితాలో దక్షిణాది రాష్ర్టాల పేర్లూ ఉంటాయన్న అంచనాలు వస్తుండటం గమనార్హం.