Koo App | న్యూఢిల్లీ, జూలై 3: దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూతపడింది. ఎక్స్(గతంలో ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మారుతున్నదని నరేంద్ర మోదీ సర్కార్ ఊదరగొట్టిన ఈ స్టార్టప్ ప్రస్తుతం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడం వల్లనే ఈ స్టార్టప్ తన సేవలను మధ్యలోనే నిలిపివేసింది. కేంద్ర మంత్రులే స్వయంగా ఆత్మనిర్భర్ యాప్గా ప్రమోట్ చేసిన ఈ సంస్థ కేవలం నాలుగేండ్లలోనే కాలగర్భంలో కలిసిపోయింది. అంతర్జాతీయ స్థాయి స్టార్టప్లను ఎదుర్కొవాలంటే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం..కానీ మోదీ సర్కార్ కేవలం ప్రమోట్ మాత్రమే చేసిందని, ఆర్థికంగా ఆదుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
నిధుల కొరత తమకు అవరోధంగా మారిందని, దేశీయ యాప్ను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావాత్కా లింక్డిన్లో పోస్ట్చేశారు. ఇక నుంచి చిన్న యెల్లో బర్డ్ కనిపించదని పేర్కొన్నారు. గతేడాదిగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టినప్పటికీ నడిపించామని, అంతర్జాతీయ సంస్థలైన డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా అవేవీ సఫలీకృతం కాకపోవడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరువురు ప్రకటించారు.
అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్లు డామినేట్ చేస్తున్నారని, భారత్ కూడా ఆ స్థాయికి చేరుకుంటుందని ఆశించినప్పటికీ ఫలితాలు వేరే విధంగా ఉన్నాయన్నారు. స్థానిక భాషలకు పెద్ద పీట వేస్తూ దేశీయ యాప్ను రూపొందించామని, ఓ దశలో 21 లక్షల రోజువారీ యాక్టివ్ యూజర్లను సంస్థ సొంతం చేసుకున్న విషయాన్ని ఇరువురు గుర్తుచేసుకున్నారు. రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విట్టర్తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు ఈ యాప్కు దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. దీంతో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది కూడా.