Market Capitalisation | ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భారత్.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్నది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటంతోపాటు ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేయడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. వివిధ దేశాల స్టాక్ మార్కెట్ల లిస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారత్ ఐదో స్థానానికి చేరుకున్నది. గత ఆరు నెలల్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్లకు పైగా పెరిగింది. 2024 ప్రారంభం నుంచి భారత్ లోని బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 24.5 శాతం వృద్ధి చెంది 5.23 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పటి వరకూ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.06 లక్ష కోట్ల డాలర్లు హరించుకు పోయింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం జపాన్ మార్కెట్ ఫ్లాట్ గా కొనసాగితే, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న హాంకాంగ్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 428 బిలియన్ డాలర్లు జత కలిసింది.
2007 మినహా భారత్ స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో ఎన్నడూ దూసుకెళ్లలేదు. 2007లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్ల నుంచి 1.81 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. తాజాగా స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే కాక కొత్తగా లిస్టెడ్ కంపెనీల జాబితా కూడా పెరుగుతోంది.
తాజాగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్దే ఫస్ట్ ప్లేస్. రిలయన్స్ ఎం-క్యాప్ 245.3 బిలియన్ డాలర్ల పై చిలుకు ఉంటే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం క్యాప్ 167 బిలియన్ డాలర్లు. బీఎస్ఈలో ఐదు కంపెనీలు 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంటాయి. మొత్తం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో రిలయన్స్, టీసీఎస్ తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14.5 శాతం ఉంటుంది. గత బుధవారానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.23 లక్షల కోట్ల డాలర్లుగా నిలిచింది.