Stock Market | ముంబై, జూలై 4: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్.. వచ్చే ఏడాది డిసెంబర్కల్లా లక్ష పాయింట్ల మార్కును చేరుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 1979 ఏప్రిల్ 1న బేస్ వాల్యూ 100 పాయింట్లతో సెన్సెక్స్ మొదలైంది. ఈ క్రమంలో గురువారం తొలిసారి 80,000 పాయింట్ల ఎగువన ముగిసింది. దీంతో గడిచిన 45 ఏండ్ల కాలంలో వార్షిక చక్ర వృద్ధిరేటు (సీఏజీఆర్) 15.9 శాతంగా ఉన్నది. ఈ వ్యవధిలో సూచీ ఏకంగా 800 రెట్లు ఎగబాకడం గమనార్హం. మరో ఏడాదిన్నరలో 20,000 పాయింట్లు ఎగిసి లక్ష పాయింట్లను తాకుతుందని చెప్తున్నారు.
గడిచిన ఐదేండ్లలో సెన్సెక్స్ 40,000 పాయింట్లు పెరిగింది. కేవలం 3 నెలల్లోనే 5,000 పాయింట్లు పుంజుకోవడం విశేషం. కాగా, ప్రతీ ఐదేండ్లకు సెన్సెక్స్ రెట్టింపు స్థాయిలో పాయింట్లను పెంచుకుంటూపోతున్నదని దలాల్ స్ట్రీట్ సీనియర్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు రాందేవ్ అగర్వాల్ అంటున్నారు. ఈ క్రమంలోనే 2029-30 నాటికి సెన్సెక్స్ 1,50,000 పాయింట్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ‘భారతీయ కార్పొరేట్ రంగం లాభాలు గత మూడు దశాబ్దాలకుపైగా కాలంలో సుమారు 17 శాతం చక్ర వృద్ధిని సాధించాయి. ఒకవేళ ప్రస్తుత ప్రైస్-టు-ఎర్నింగ్స్ లెవల్స్ 25 రెట్లు ఇలాగే కొనసాగితే సెన్సెక్స్ చక్ర వృద్ధిని 15 శాతంగా భావించవచ్చు. అంటే ప్రతీ ఐదేండ్లకు రెట్టింపు అవుతుందన్నమాట’ అని అన్నారు. ప్రముఖ మార్కెట్ మదుపరి మార్క్ మోబియస్ స్పందిస్తూ.. భారత జీడీపీ 7 శాతంతో, కంపెనీలు 14-15 శాతం వృద్ధితో పయనిస్తే.. సెన్సెక్స్ కూడా వచ్చే 10 ఏండ్లలో ఇదే జోష్తో పరుగులు పెట్టగలదన్నారు.
బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 80,000 మార్కుకు ఎగువన ముగిసింది. గురువారం 62.87 పాయింట్లు పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా 80,049.67 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 80,392.64 వద్దకు ఎగిసి ఇంట్రా-డే హై రికార్డునూ నెలకొల్పింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 15.65 పాయింట్లు అందుకుని మొదటిసారి 24,302.15 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 24,401 పాయింట్లను తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటర్స్, సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. రంగాలవారీగా హెల్త్కేర్, ఐటీ, టెక్నాలజీ, ఆటో, టెలికం సూచీలు పుంజుకున్నాయి.
బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.447.30 లక్షల కోట్లకు చేరుకున్నది. గురువారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసే నాటికి రూ.4,47,30,452.99 కోట్ల (5.36 ట్రిలియన్ డాలర్లు)కు వెళ్లింది. ఈ ఒక్కరోజే రూ.2 లక్షల కోట్లు ఎగిసింది. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ 0.62 శాతం, 0.60 శాతం చొప్పున పెరిగాయి.