న్యూఢిల్లీ, జూన్ 26: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. దేశంలోని 14 రాష్ర్టాల్లో విస్తరించిన ఓ ముఠా ఈ సిండికేట్ మోసానికి పాల్పడినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (డీజీజీఐ) జైపూర్ జోనల్ యూనిట్ గుర్తించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రూ.1,047 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసంలో 569 నకిలీ సంస్థలను అధికారులు కనుగొన్నారు.
ఇందులో ఢిల్లీకి చెందినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. మిగతావి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమబెంగాల్, కర్నాటక, గోవా, అస్సోం, ఉత్తరాఖండ్లకు చెందినవి. ఇక ఈ కేసులో ఇప్పటిదాకా సిండికేట్, బ్రోకర్లు వాడిన 73 ఖాతాలను అధికారులు అటాచ్ చేశారు. కాగా, ఢిల్లీకి చెందిన రిషభ్ జైన్ (30)ను అసలు సూత్రధారిగా గుర్తించారు. ఈ నకిలీ కంపెనీల నిర్వహణకు 10 మంది ఉద్యోగులను జైన్ నియమించుకున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గట్టి నిఘాతో జైన్ను పట్టుకోగలిగారని పేర్కొన్నది. ఆదివారం అరస్టైన జైన్ను జైపూర్లోని ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపర్చారు. వచ్చే నెల 7దాకా కోర్టు రిమాండ్ విధించింది.