Gold Price | న్యూఢిల్లీ, జూలై 4: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పుత్తడి ధర మళ్లీ రూ.73 వేల మార్క్ను అధిగమించింది. తులం ధర రూ.530 అధికమై రూ.73,080కి చేరుకున్నది. అంతకుముందు ధర రూ.72,550గా ఉన్నది.
పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,200 అధికమై రూ.92,500 పలికింది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.710 పుంజుకొని రూ.73,090కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.650 అధికమై రూ.67 వేలుగా నమోదైంది. అలాగే రూ.1,500 అధికమైన కిలో వెండి రూ.96 వేల నుంచి రూ.97,500కి ఎగబాకింది.
అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒకేరోజు 16 డాలర్లు పెరిగి 2,355 డాలర్లకు చేరుకోవడం వల్లనే దేశీయంగా ధరలు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అలాగే వెండి కూడా 29.80 డాలర్ల నుంచి 30.25 డాలర్లకు ఎగబాకింది. ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయంటూ వచ్చిన అంచనాలు బంగారం పెరగడానికి ప్రధాన కారణమన్నారు.