PMAY Scheme | ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మళ్లీ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024 -25)గాను గత నెల పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో దీన్ని తిరిగి తీసుకొచ్చారు.
ఈ పథకం 2015లో మొదలైంది. దేశంలోని అన్ని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలకు పక్కా గృహాలు, కనీస వసతుల్ని కల్పించడమే ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం లక్ష్యం. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం ఇందులో పీఎంఏవై-గ్రామీణ్, పీఎంఏవై-అర్బన్ పేరిట రెండు విభాగాలున్నాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలు కోసం తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీలో రాయితీ ప్రయోజనాన్ని పీఎంఏవై అందిస్తుంది.
ఆన్లైన్లోనైతే అర్హులు తొలుత పీఎంఏవై అధికారిక వెబ్సైట్కు వెళ్లాలి. ఆపై ‘సిటిజన్ అసెస్మెంట్’, ‘బెనిఫిట్స్ అండర్ అదర్ 3 కాంపోనెంట్స్’లపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ వివరాలిస్తే దరఖాస్తు ఫారం వస్తుంది. అందులో అన్ని వివరాలను నింపితే సెక్యూరిటీ క్యాప్చా వస్తుంది. దాన్ని పూర్తిచేసి ‘సేవ్’ చేస్తే అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దీన్ని భవిష్యత్తు అవసరాలకు రెఫరెన్స్గా తీసుకోవాలి. ఆఫ్లైన్లోనైతే.. ఎస్బీఐ, ఇతర పీఎంఏవై పథకం వర్తించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించాలి. ఆదాయ ధ్రువీకరణ, కావాల్సిన డాక్యుమెంట్లు చూపించి ఆమోదం పొందవచ్చు. ఆపై సబ్సిడీ వడ్డీరేటుపై ఇంటి కొనుగోలు ప్రక్రియలోకి దిగవచ్చు.