న్యూఢిల్లీ: సంపన్నుల ర్యాంకింగ్లో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మధ్య పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ లిస్టులో మళ్లీ గౌతమ్ అదానీ(Gautam Adani) టాప్ ప్లేస్ కొట్టేశాడు. హిండన్బర్గ్ ఆరోపణలపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చడంతో అదానీ ఆస్తులు మళ్లీ పెరిగాయి. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా ప్రకారం.. ఒక్క రోజులోనే అదానీ ఆస్తి 7.7 బిలియన్ల డాలర్లు పెరిగింది. దీంతో ఆయన నికర ఆస్తి విలువ 97.6 బిలియన్ల డాలర్లుక చేరుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చైర్మెన్ అంబానీ ఆస్తి విలువ ప్రస్తుతం ఇండెక్స్ ప్రకారం 97 బిలియన్ల డాలర్లుగా ఉంది.
హిండన్బర్గ్ రిపోర్టుతో గత ఏడాది తీవ్ర ఒడిదిడుకులు ఎదుర్కొన్న అదానీ మళ్లీ పుంజుకుంటున్నారు. 1980 దశకంలో డైమెండ్ వ్యాపారిగా ఉన్న ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. అయితే గత ఏడాది స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీలకు భారీ షాక్ తగిలింది. దాదాపు 150 బిలియన్ల డాలర్ల మార్కెట్ను ఆయన కోల్పోయారు. ఆ ఘటన తర్వాత మళ్లీ ఇన్వెస్టర్లను రాబట్టేందుకు అదానీ తీవ్రంగా కృషి చేశారు.