Stock Market | ముంబై, జూలై 3: రాబోయే మూడు సంవత్సరాలు మదుపరులకు ఈక్విటీ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాబడులను అందించకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆర్ జానకిరామన్ అంచనా వేస్తున్నారు. గడిచిన మూడేండ్ల మాదిరిగా దేశీయ స్టాక్ మార్కెట్లు తదుపరి మూడేండ్లు పరుగులు పెట్టకపోవచ్చని బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. కానీ ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే మాత్రం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మెరుగ్గానే ఉంటాయన్నారు. అయితే అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ ఆల్టైమ్ హైని తాకిన నేపథ్యంలో జానకిరామన్ అంచనా మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
ప్రస్తుతం మార్కెట్ వాల్యుయేషన్స్ అధికంగా ఉన్నాయన్న జానకిరామన్.. నిజానికి గత కొన్నేండ్లుగా ఆయా కంపెనీల ఆర్థిక ఫలితాలను మించి వాటి షేర్లు ట్రేడ్ అవుతున్నాయని చెప్పారు. అయితే ఇకపై మదుపరులు తమ పెట్టుబడులను తిరిగి తీసుకునే దిశగా అడుగులు వేయబోతున్నారన్నారు. సూచీలు జీవనకాల గరిష్ఠాల్లో ఉన్న వేళ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు పెద్దపీట వేస్తారని చెప్తున్నారు. కాగా, స్టాక్ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున వస్తున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో)పైనా స్పందించారు. కొత్తగా లిస్టింగ్ అవుతున్న సంస్థలు అందివచ్చిన సొమ్మును తెలివిగా వాడుకోవాలని సూచించారు. ఇదిలావుంటే ఓ మల్టీక్యాప్ కొత్త ఫండ్ను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆఫర్ చేస్తున్నది. ఈ నెల 8న మొదలై.. 22న ముగుస్తుంది. ఒక్కో యూనిట్ రూ.10కి లభిస్తుంది.
బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో బుధవారం రూ.445.43 లక్షల కోట్లకు చేరింది. భారీ లాభాల నడుమ మదుపరుల సంపద రూ.4,45,43,642.29 కోట్లు (5.33 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ 0.86 శాత0 చొప్పున పెరిగాయి. రంగాలవారీగా బ్యాంకింగ్ షేర్లు 1.75 శాతం లాభపడ్డాయి. ఆర్థిక సేవలు, టెలీకమ్యూనికేషన్స్, సర్వీసెస్, ఇండస్ట్రియల్స్, ఎఫ్ఎంసీజీ సూచీలు 1.55 శాతం నుంచి 0.81 శాతం వరకు పుంజుకున్నాయి. అదానీ పోర్ట్స్ షేర్ విలువ అత్యధికంగా 2.49 శాతం పెరిగింది. కొటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్గ్రిడ్ షేర్లు ఆకర్షణీయ లాభాలను అందుకున్నాయి.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరో చారిత్రక స్థాయిని తాకింది. తొలిసారి 80,000 మార్కుపైకి వెళ్లింది. గరిష్ఠంగా 80,074.30 వద్దకు చేరింది. అయితే మదుపరుల అమ్మకాల ఒత్తిడితో రికార్డు స్థాయిని నిలుపుకోలేకపోయింది. అయినప్పటికీ 545.35 పాయింట్లు లేదా 0.69 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 79,986.80 వద్ద స్థిరపడింది. కాగా, కేవలం 3 నెలల్లోనే సూచీ ఏకంగా 5వేల పాయింట్లు పెరగడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 162.65 పాయింట్లు లేదా 0.67 శాతం ఎగిసి మొదటిసారి 24,286.50 వద్ద నిలిచింది. ఒకానొక దశలోనైతే 24,307.25 వద్దకు వెళ్లి ఇంట్రా-డే హైని నెలకొల్పింది.