న్యూఢిల్లీ, మే 18: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. గడిచిన ఐదు వారాల్లో ఏకంగా రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నా రు. స్టాక్ ఎక్సేంజ్ల వద్ద ఉన్న సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కంటే కొన్ని రోజుల ముందునుంచే ఎఫ్ఐఐలు అమ్మకాల బటన్ నొక్కుతునే ఉన్నారు. ఏప్రిల్ 8 నుంచి 12 మధ్యకాలంలో రూ.13,672 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన ఎఫ్ఐఐలు..ఏప్రిల్ 15 నుంచి మే 17 వరకు రూ.50,260 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మొత్తంగా ఈ ఏడాది ఎఫ్ఐఐలు రూ.1,17,788 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని ఎక్సేం జ్ నివేదికలో వెల్లడించింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు కూడా ఉండటంతో ఎఫ్ఐఐలు పెట్టుబడులు తరలించుకుపోవడానికి కూడా కారణం.
ఒకవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపుతుంటే..దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రం నిధులను భారీగా కుమ్మరించారు. గడిచిన ఐదు వారాల్లో రూ.64,400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే డీఐఐలు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1,79,122 కోట్ల విలువైన షేర్లను కొనుగోళ్లు చేశారు. ఏప్రిల్ 12 నుంచి మే 17 మధ్యకాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా తగ్గింది. గడిచిన ఏడాది పైగా భారీగా నిధులు కుమ్మరించిన ఎఫ్ఐఐలు..ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని సర్వేలు వెల్లడిస్తుండటంతో ఎఫ్ఐఐల్లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు, భారతీయ స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకుల సూచీ(ఇండియా వీఐఎక్స్) తొలి విడుత ఎన్నికలప్పటీ నుంచి ఇప్పటి వరకు 77 శాతానికి పైగా పెరగడం విదేశీ మదుపరుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నది. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మదుపరులలో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలకు ఇండియా వీఐఎక్స్ అద్దం పడుతున్నదని మెజారిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎఫ్ఐఐలు వరుసగా అమ్మకాలు జరుపుతున్నారు. అస్థిరత పరిస్థితులు కొనసాగుతుండటం, ఎన్నికల్లో అనిశ్చితి, చైనా మార్కెట్లు పుంజుకోవడంతో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను తరలించుకుపోతున్నారు.
– జయకృష్ణ గాంధీ, ఎంకీ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్
భారత్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కితీసుకున్న ఎఫ్ఐఐలు.. పొరుగు దేశమైన చైనా మార్కెట్లోలో పెట్టుబడులు పెట్టారు. చైనా సూచీలు అంచనాలకుమించి రాణించడంతో ఎఫ్ఐఐలు తమ ఇన్వెస్ట్మెంట్లను ఇక్కడికి తరలించారు. షాంఘై కంపోజిట్ ఇండెక్స్ సూచీ ఈ ఏడాది 15 శాతం రిటర్నులు పంచింది. 2024 ఫిబ్రవరిలో కనిష్ఠ స్థాయికి జారుకున్న సూచీ ఇప్పటి వరకు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడంతో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఒక్క మార్చి నెలలోనే ఎఫ్ఐఐలు 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను చైనా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు.