అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పొవెల్ జాక్సన్హోల్ సదస్సులో వెల్లడించే సంకేతాల కోసం ఎదురుచూస్తూ గతవారం ఇతర ప్రపంచ మార్కెట్ల తరహాలోనే దేశీ స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 250 పాయింట్లకు అటూఇటూగా ట్రేడైన ఎన్ఎస్ఈ నిఫ్టీ వారం మొత్తంమీద 199 పాయింట్లు నష్టపోయి 17,559 పాయింట్ల వద్ద ముగిసింది. మన మార్కెట్ ముగిసిన తర్వాత పొవెల్ చేసిన ప్రసంగంలో కఠిన ద్రవ్య విధాన వైఖరిని ప్రదర్శించడంతో శుక్రవారం అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ప్రకంపనలు సోమవారం ఇక్కడి మార్కెట్లో ఉంటాయని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ తెలిపారు. డాలర్ ఇండెక్స్ 110 స్థాయిని దాటి, క్రూడ్ ధర 107 డాలర్ల స్థాయికి పెరిగితే భారీ కరెక్షన్ రావచ్చని మార్కెట్ నిపుణుడు కునాల్ బోత్రా చెప్పారు.
17,500 దిగువన కరెక్షన్
సాంకేతికంగా నిఫ్టీ 17,500 స్థాయిని కోల్పోయి, ముగిస్తే మార్కెట్ కరెక్షన్ మోడ్లోకి వెళుతుందని కునాల్ బోత్రా అంచనా వేశారు. ఫాలింగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ప్యాట్రన్ నిఫ్టీకి అవరోధం కల్గిస్తూనే ఉంటుందని, ఇది 17,700 సమీపంలో ఉన్నదని మిలన్ వైష్ణవ్ వివరించారు. ఈ వారం నిఫ్టీకి 17,400 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చని, ఈ స్థాయిని వదులుకుంటే 17,280 పాయింట్ల వద్ద తదుపరి మద్దతు ఉన్నదన్నారు. నిఫ్టీ పెరిగితే 17,600 పాయింట్ల స్థాయి తొలుత నిరోధించవచ్చని, అటుపైన 17,780 స్థాయి వద్ద మరో అవరోధం ఉందన్నారు.