Fake Notes | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): దేశంలో పెద్దనోట్లు రద్దుచేసి ఎనిమిదేండ్లు పూర్తైనప్పటికీ ఇంకా నకిలీ నోట్లు చలమణి అవుతూనే ఉన్నాయి. రిజర్వు బ్యాంకు నివేదిక ఆధారంగా కేంద్ర సర్కార్ పార్లమెంట్కు తాజాగా చెప్పిన సమాధానం ప్రకారం.. నకిలీ నోట్లు వినియోగం అంతకంతకు పెరిగినట్టు వెల్లడించింది. గడిచిన ఆరేండ్ల నివేదికను పరిశీలిస్తే ప్రతిఏటా రూ.2 లక్షలకుపైగా నకిలీ నోట్లు సీజ్ అవుతూనే ఉన్నాయి.
2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.3.17 లక్షల విలువైన నకిలీ కరెన్సీని సీజ్ చేశారు. నిరుడు మాత్రం కాస్త తగ్గి రూ.2.22 లక్షలు సీజ్ చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నల్లధనం, నకిలీ నోట్లను నిర్మూలించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అప్పట్లో చెప్పారు. కానీ, నల్లధనం అటుంచి..నకిలీ నోట్లు మాత్రం ఇప్పటికీ చలామణి అవుతునూ ఉన్నాయి. మరోవైపు, నోట్ల రద్దు తర్వాత కేవలం రూ.8.50 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకొని 39 కేసులు నమోదుచేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
అయితే, 2020లో రూ.92 కోట్ల విలువైన 8,34,947 నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అంతకుముందు 2019లో రూ.25 కోట్ల విలువైన 2,87,404 నోట్ల సీజ్చేసింది. మరోవైపు, 2018-19లో రూ.3,17,384 విలువైన నకిలీ కరెన్సీలను సీజ్ చేసిన దర్యాప్తు సంస్థలు..ఆ తర్వాత 2019-20లో రూ.2,96,695, 2020-21లో రూ.2,08, 625, 2021-22లో రూ.2,30,971, 2021-22లో రూ.2,25,759, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,22,639 నకిలీ కరెన్సీని సీజ్చేసినట్టు తాజాగా వెల్లడించారు. నకిలీ కరెన్సీలో 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 (కొత్త, పాత సిరీస్ నోట్లు) 1000, 2000 నోట్లు ఉన్నాయి.
నోట్లలో కొత్త భద్రతా ఫీచర్లు
నకిలీ నోట్లను తగ్గించడానికి ఎప్పటికప్పుడు కొత్త భద్రతా ఫీచర్లతో నోట్లను తయారు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.