Education Loans | న్యూఢిల్లీ, జూన్ 29: వ్యక్తిగత రుణాల విభాగంలో విద్యా రుణాల్లోనే ఎక్కువగా ఎగవేతలున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ తాజా నివేదికలో వెల్లడించింది. గృహ రుణాల్లో డిఫాల్టర్లు తక్కువగా ఉన్నట్టు చెప్పింది. పర్సనల్ లోన్లలో నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు లేదా ఎన్పీఏ) అత్యధికంగా ఎడ్యుకేషన్ లోన్లే ఉన్నాయని ఈ ఏడాది జూన్కుగాను ఆర్బీఐ విడుదల చేసిన ఆర్థిక సుస్థిరత నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో క్రెడిట్ కార్డు రుణాలు, వాహన రుణాలుండగా.. చివరి స్థానంలో గృహ రుణాలున్నట్టు స్పష్టమైంది.
విదేశీ చదువులతో..
విదేశీ చదువుల కోసం విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారని, అందుకే ఇటీవలికాలంలో విద్యా రుణాలు బాగా పెరిగిపోయాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత రుణాల మొండి బకాయిల్లో విద్యా రుణాల వాటా 3.6 శాతానికి చేరిందంటున్నారు. అయితే అన్ని పర్సనల్ లోన్ విభాగాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల ఆస్తుల నాణ్యతలో విస్తృత శ్రేణిలో పెరుగుదల కనిపిస్తున్నట్టు ఆర్బీఐ తాజా నివేదిక పేర్కొన్నది. ఈ క్రమంలోనే అన్ని బ్యాంక్ గ్రూపుల వ్యాప్తంగా వ్యక్తిగత రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తుల క్షీణత కనిపిస్తున్నదని ఎఫ్ఎస్ఆర్లో సెంట్రల్ బ్యాంక్ తెలియజేసింది. ఇక పారిశ్రామిక రంగం పరిధిలో వెహికిల్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ విభాగాలు తప్ప అన్ని ప్రధాన ఉప రంగాల్లో అసెట్ క్వాలిటీ మెరుగుపడినట్టు కూడా పేర్కొన్నది.
హోం లోన్లకు గిరాకీ
పర్సనల్ లోన్లలో గృహ రుణాలకు ఈ ఏడాది మార్చిలో గిరాకీ 36.5 శాతం పెరిగిందని ఆర్బీఐ చెప్పింది. 25.2 శాతంతో తర్వాతి స్థానంలో క్రెడిట్ కార్డులున్నాయి. 20.5 శాతంతో విద్యా రుణాలు 3వ స్థానంలో, 19.9 శాతంతో ఇతర వ్యక్తిగత రుణాలు 4వ స్థానంలో ఉన్నాయి. వాహన రుణాలకు 18.3 శాతం డిమాండ్ కనిపించింది. కాగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల రుణాల వృద్ధిలో సగానికిపైగా వ్యక్తిగత రుణాలే ఉండటం గమనార్హం. ఇదిలావుంటే ఈ ఏడాది ఏప్రిల్లో క్రెడిట్ కార్డు రుణ బకాయిలు 23 శాతంగా ఉన్నాయి. అయితే నిరుడు ఇవి 31 శాతంగా ఉన్నాయి. ఈ ఏప్రిల్లో రిటైల్ రుణాల్లో వృద్ధి 17.1 శాతంగా ఉన్నది. నిరుడు 25.7 శాతం.
ఆర్బీఐ హెచ్చరికలు
భారీగా పెరుగుతున్న వ్యక్తిగత, అన్సెక్యూర్డ్ రుణాలపై బ్యాంకింగ్, ఇతర రుణదాతలను ఆర్బీఐ హెచ్చరిస్తూనే ఉన్నది. ఈ క్రమంలోనే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు అంతర్గత నిఘా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.