న్యూఢిల్లీ : టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ సహా ఐదు కంపెనీలను హ్యాండిల్ చేస్తూ పనిఒత్తిడితో బిజీబిజీగా గడుపుతున్నారు. ట్విట్టర్, టెస్లా, న్యూరాలింక్, స్పేస్ఎక్స్, కాస్మెటిక్ బ్రాండ్ ది బోరింగ్ కంపెనీలను ఆయన ఒంటిచేత్తూ నడుపుతున్నారు. ఈ ఐదు బ్రాండ్ల ఓనర్గా మస్క్ ఇప్పుడు బిజీ మ్యాన్గా మారిపోయారు.
న్యూయార్క్లో నవంబర్ 4న జరిగిన రాన్ బారన్ వార్షిక సదస్సులో మస్క్ మాట్లాడుతూ తన బిజీ షెడ్యూల్ను వెల్లడించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన తర్వాత తాను వారానికి ఏకంగా 120 గంటలు పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. నిద్ర నుంచి లేవడం పనిచేయడం మళ్లీ నిద్రకు ఉపక్రమించడం వారానికి ఏడు రోజులు తాను ఇలానే గడుపుతున్నానని తెలిపారు.
ట్విట్టర్ను గాడిన పెట్టిన తర్వాత తాను మళ్లీ టెస్లా, స్పేస్ఎక్స్లపై దృష్టి సారిస్తానని అన్నారు. నాటకీయ ట్విస్ట్లు, ఉత్కంఠభరిత పరిణామాల మధ్య 44 బిలియన్ డాలర్ల డీల్తో ట్విట్టర్ను సొంతం చేసుకున్న తర్వాత మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్లో సమూల మార్పులకు తెరలేపారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగర్ చీఫ్ విజయ గద్దె, సీఎఫ్ఓ నెల్ సెగల్ను తొలగించిన అనంతరం కంపెనీలో దాదాపు సగం మంది సిబ్బందిపై వేటు వేశాడు. నెలకు రూ 650 చెల్లించిన వారికే బ్లూ టిక్ ఫీచర్ను అందుబాటులో తీసుకువచ్చారు.