Reliance Jio | న్యూఢిల్లీ, జూన్ 27: దేశీయ టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 3 నుంచి అన్ని రకాల ప్లాన్ల టారిఫ్ ధరలను 12 శాతం నుంచి 27 శాతం వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. రెండున్నరేండ్ల తర్వాత చార్జీలను పెంచడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో 1 జీబీ డాటా ప్యాక్ ధర 27 శాతం పెంచడంతో రూ.15 నుంచి రూ.19కి చేరుకున్నది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..5జీ, కృత్రిమ మేధస్సు సాంకేతిక రంగంలో భారీగా పెట్టుబడులతో టెలికం రంగంలో నూతన ఆవిష్కరణలు సాధ్యమయ్యాయని, దీంతో స్థిరమైన వృద్ధిని సాధించడానికి కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
అలాగే 75 జీబీ పోస్ట్పెయిడ్ డాటా ప్లాన్ చార్జీ రూ.399 నుంచి రూ.449కి పెరగనున్నది. అత్యంత ప్రజాదరణ పొందిన 84 రోజుల కాలపరిమితితో అందిస్తు న్న రూ.666 ప్లాన్ చార్జీని 20 శాతం సవరించడంతో ఇక నుంచి రూ.799కి చేరుకోనున్నది. వార్షిక రీచార్జి ప్లాన్లను సైతం 20-21 శాతం సవరించడంతో రూ.2,999 నుంచి రూ. 3,599కి చేరాయి. గతం లో ఇవి రూ. 1,559 నుంచి రూ. 1,899 మధ్య లో ఉండేవి. వీటితోపాటు రోజుకు 2 జీబీ డాటా, అంతకంతే అధిక ప్లాన్లు కూడా సంస్థ అందిస్తున్నది.
జియో బాటలోనే ఇతర టెలికం సంస్థలైన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు సైతం టారిఫ్లను పెంచడానికి సమయాత్తమవుతున్నాయి. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా వినియోగదారుల సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పెంచడానికి సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 2021లో టెలికం చార్జీలను 40 శాతం వరకు పెంచిన సంస్థలు మళ్లీ మూడేండ్ల తర్వాత సవరించాయి. ప్రస్తుతం ఒక్కో కస్టమర్ నుంచి రూ.200 ఆదాయం వస్తుండగా, దీనిని రూ.300కి పెంచుకోవాలనుకుంటున్నది ఎయిర్టెల్.