Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం వరుస లాభాల్లో కదలాడాయి. అయితే చివర్లో నష్టాలు దెబ్బతీశాయి. ఆఖరిరోజు శుక్రవారం భారీగా క్షీణించాయి. మదుపరులు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ఓవరాల్గా గత వారం మార్కెట్లు నష్టాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఫలితంగా అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 350.77 పాయింట్లు కోల్పోయి 80,981.95 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 117.15 పాయింట్లు దిగజారి 24,717.70 దగ్గర నిలిచింది. నిజానికి గత వారం తొలిసారి సెన్సెక్స్ 82,000 మార్కును, నిఫ్టీ 25,000 మార్కును దాటాయి. ఇదిలావుంటే ఈ వారం ఒడిదొడుకులకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తున్నది. ఇజ్రాయెల్-హమాస్ నడుమ ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా అమెరికా జోక్యం కలవరం పుట్టిస్తున్నది. అలాగే మదుపరులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో ద్వైమాసికానికిగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించే ద్రవ్యవిధాన పరపతి సమీక్ష ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.
గురువారం ఆర్బీఐ తమ పాలసీని ప్రకటించనున్నది. సుదీర్ఘకాలంగా వడ్డీరేట్లను యథాతథంగానే సెంట్రల్ బ్యాంక్ ఉంచుతున్నది తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నది. అయితే ఇప్పటికీ ధరాఘాతం కొనసాగుతున్నది. దీంతో రాబోయే సమీక్షలో వడ్డీరేట్లపై ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నదే కీలకం. ఒకవేళ ఎప్పట్లాగే వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే సమీక్ష ముగిస్తే.. ఆటో, బ్యాంకింగ్, స్టీల్, రియల్టీ, దాని అనుబంధ రంగాల షేర్లు సెల్లింగ్ ప్రెషర్ను ఎదుర్కోవచ్చు. వడ్డీరేట్లు తగ్గితే మాత్రం ఈ రంగాల్లోని సంస్థల షేర్లన్నీ లాభాలను సంతరించుకునే వీలున్నది. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. ఇక అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,200 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 25,100-25,200 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.