Market Pulse | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగించాయి. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఆకర్షణీయ లాభాలనే అందుకున్నాయి. అయితే చివరి రోజున మాత్రం మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సూచీలు నయా ఆల్టైమ్ హైల్లో స్థిరపడలేకపోయాయి. అయినప్పటికీ అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సె క్స్ 1,822.83 పాయింట్లు లేదా 2.36 శాతం పెరిగి 79వేల స్థాయికి ఎగువన 79,032. 73 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 509.50 పాయింట్లు లేదా 2.16 శాతం అందిపుచ్చుకుని 24వేల స్థాయిని దాటి 24,010.60 దగ్గర నిలిచింది.
అయితే ఈ వారం మదుపరులు లాభాల స్వీకరణకు దిగవచ్చన్న అంచనాలున్నాయి. సూచీలు దాదాపు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతుండటమే కారణం. మదుపరులు పెట్టుబడుల జోష్ను కొనసాగించేందుకూ వీలు లేకపోలేదంటున్నారు. జూన్ నెల వాహన విక్రయాలు, జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలు మార్కెట్ ట్రెండ్ను ప్రభావితం చేయవచ్చు.
ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 23,700 పాయింట్ల స్థాయి కీలకం. దీనికి దిగువన ముగిస్తే 23,400 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చు. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 24,400-24,600 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని చెప్తున్నారు.