BSNL | న్యూఢిల్లీ, జూలై 1: దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఓ నయా ప్లాన్ను పరిచయం చేసింది. దీని రేటు రూ.249 మాత్రమే. కాలవ్యవధి 45 రోజులు. అన్లిమిటెడ్ కాల్స్తో ఉన్న ఈ ఆకర్షణీయ ప్యాకేజీలో రోజూ 2జీబీ డాటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లను వినియోగదారులు వాడుకోవచ్చు. అయితే ప్రైవేట్ రంగ టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. ఇటీవలే తమ ప్లాన్ల ధరలను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఇప్పుడు టెలికం ఇండస్ట్రీలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
అధిక టారీఫ్ల నుంచి ఉపశమనాన్ని కోరుకునే మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకే బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలున్న ఈ ప్లాన్ను తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇతర టెలికం కంపెనీలు ఇదే ధర (రూ.249)కు రోజుకు 1జీబీ డాటానే ఇస్తుండగా, వ్యాలిడిటీ కూడా 28 రోజులే ఉంటుండటం గమనార్హం. దీంతో బీఎస్ఎన్ఎల్ నూతన ప్లాన్లో రోజువారీ డాటా రెట్టింపవడమేగాక, ప్లాన్ గడువు కూడా 17 రోజులు పెరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ వినియోగదారులకు ఇది గొప్ప ఊరటగానే చెప్పుకోవచ్చు. ఇదిలావుంటే బుధవారం నుంచి జియో, ఎయిర్టెల్.. గురువారం నుంచి వొడాఫోన్ ఐడియా తమ ప్లాన్ల ధరలను దాదాపు 26 శాతం మేర పెంచుతున్నాయి. దీంతో ఒక్కో వినియోగదారునిపై గరిష్ఠంగా రూ.600 భారం పడబోతున్నది.