హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్యఘర్-ముఫ్తీ బిజిలీ పథకం క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహికులకు పోర్టల్ చుక్కలు చూపెడుతున్నదని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షులు బీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకునేందుకు వేలాది మంది ఆసక్తి చూపుతున్నా..పథకంలో పొందుపరిచిన నిబంధనల కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా నాలుగు నెలలు గడిచినప్పటికీ అధికారిక పోర్టల్లో సాంకేతిక లోపాల కారణంగా దరఖాస్తుల స్వీకరణ విధానం పనిచేయకపోవడంతో ఔత్సాహికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద అపార్టుమెంట్లు, సొసైటీలు ఏర్పాటు చేసుకునేందుకు పోర్టల్ అనుమతించడం లేదని పలువురు ఔత్సాహికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇప్పటికైనా సులభతరమైన విధానాన్ని కేంద్రం అమలు చేయాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. దీనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సీబీడీటీ చీఫ్గా రవి అగర్వాల్
న్యూఢిల్లీ, జూన్ 29: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) నూతన చైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి.. ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న నితిన్ గుప్తా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. సీబీడీటీ చీఫ్గా జూన్, 2022లో నియమితులైన గుప్తా గతేడాది సెప్టెంబర్లోనే పదవీ విరమణ కావాల్సి ఉండగా, పదవీ కాలాన్ని తొమ్మిది నెలలు పొడిగించింది. దీంతో ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు.
టికెట్లపై ఆకాశ ఎయిర్ ఆఫర్
న్యూఢిల్లీ, జూన్ 29: చౌక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్.. దేశీయంగా నడిచే విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ‘సేవర్’ అండ్ ‘ఫ్లెక్సి’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ దేశీయంగా నడుస్తున్న 22 రూట్లకు వర్తించనున్నది. ఈ ఆఫర్ జూలై 1 వరకు అందుబాటులో ఉండనున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జూలై 5 నుంచి సెప్టెంబర్ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది.