Stocks | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ మద్దతుతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ మంగళవారం లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 308 పాయింట్ల లాభంతో 77,301 పాయింట్లతో తాజా జీవిత కాల గరిష్టాన్ని తాకితే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 92 పాయింట్ల లబ్ధితో 23,558 పాయింట్ల వద్ద స్థిర పడింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.42 లక్షల కోట్లు వృద్ధి చెంది రూ.437.3 లక్షల కోట్లకు చేరుకున్నది.
అంతకుముందు బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 77,367 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,579 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 46,278.53 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 46,255 పాయింట్ల (0.43 శాతం) లబ్ధితో ముగిసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ సైతం 51,758.97 పాయింట్ల గరిష్టానికి చేరుకుని ట్రేడింగ్ ముగిసే సమయానికి 51,694 (0.96 శాతం) పాయింట్ల లబ్ధితో స్థిర పడింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా ఇండెక్సులు 0.6 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్సులు ఒక్కోశాతం లబ్ధితో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభ పడగా, మారుతి సుజుకి, టాటా స్టీ్ల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఐటీసీ నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 84.06 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ రూ.83.42 వద్ద ముగిసింది.