ముంబై, జూన్ 25: దేశ జీడీపీ వృద్ధిరేటును అధిక వడ్డీరేట్లు అడ్డుకోబోవని ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ నొక్కిచెప్పారు. మంగళవారం ఇక్కడ బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్రవ్యోల్బణం అదుపే ఆర్బీఐ లక్ష్యమని స్పష్టం చేశారు.
ధరల నియంత్రణకు తగ్గట్టుగానే ద్రవ్య విధానం ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని తేల్చిచెప్పారు.దేశ జీడీపీ 8 శాతం దిశగా వెళ్తున్నదన్న దాస్.. వృద్ధిరేటు బాగుంటే, ఆకర్షణీయంగా ఉంటే ఇప్పుడున్న అధిక వడ్డీరేట్ల ప్రభావం లేనట్టేగా అని చెప్పుకొచ్చారు. ఇక ద్రవ్యోల్బణం గణాంకాలపై స్పందిస్తూ.. 2022 లో గరిష్ఠంగా 7.8 శాతంగా ఉన్నదని, ఇప్పుడు 3.1 శాతం నుంచి 4.7 శాతం మధ్యకే పరిమితమైందని దాస్ అన్నారు.
వర్షాభావ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు. ధరల అదుపుపైనే ఆర్బీఐ దృష్టి పెట్టడంవల్ల రైతాంగానికి ఇబ్బందులు ఉంటున్నాయన్న వాదనల్ని దాస్ తోసిపుచ్చారు. రైతులూ వినియోగదారు లేనన్న ఆయన ద్రవ్యోల్బణం తగ్గితే వారికీ ప్రయోజనమేనన్నారు.