హైదరాబాద్, జూలై 4: సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం కావడంతో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో సిమెంట్ తయారీ సంస్థలు తమ ధరలను తగ్గించాయి. దీంతో రాష్ట్రంలో బస్తా సిమెంట్ ధర రూ.20 వరకు తగ్గించాయి. ప్రతియేటా వర్షాకాలంలో ధరలు తగ్గడం సహజమని డీలర్ వెల్లడించారు. ఒకవైపు వర్షాలు కురుస్తుండటం, మరోవైపు ప్రభుత్వానికి చెందిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుండటం, రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేగాన్ని తగ్గించడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు.
మళ్లీ పండుగ సీజన్ నాటికి ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పటడంతో నూతన ప్రాజెక్టుల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయన్నారు.50 కిలోల అల్ట్రాటెక్ సిమెంట్ బస్తా ధర రూ.310కి దిగిరాగా, బిర్లా రూ.290, చెట్టినాడు రూ.250గాను, ప్రియా బస్తా ధర రూ.245కి తగ్గాయి. మరోవైపు, స్టీల్ ధరలు కూడా భారీగా తగ్గాయి. టన్ను ధర రూ.6 వేలు తగ్గించాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సిమెంట్ రంగంలో వృద్ధి సింగిల్ డిజిట్ 2-3 శాతానికి పరిమితం కానున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. లోక్సభ ఎన్నికల కారణంగా నిర్మాణ రంగంలో మందకొడి పరిస్థితులు నెలకొనడం ఇందుకు కారణమని తెలిపింది. అయినప్పటికీ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను సిమెంట్ రంగంలో వృద్ధి 7-8 శాతంగా ఉంటుందని అంచనాను వేస్తున్నది.
ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, గృహ రంగాల్లో సిమెంట్కు డిమాండ్ అధికంగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద మరిన్ని ఇళ్లు మంజూరు చేయనుండటం, పారిశ్రామిక సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇందుకు కారణమని విశ్లేషించింది. దీంతో సిమెంట్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి.
ప్రస్తుతం సిమెంట్ రంగంలో ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ అగ్రస్థానంలో ఉండగా, అదానీ గ్రూపు సంస్థ అంబుజా సిమెంట్ కూడా రాణిస్తున్నది. మార్చి 2015లో 45 శాతంగా ఉన్న టాప్ ఐదు కంపెనీల మార్కెట్ వాటా మార్చి 2024 నాటికి 54 శాతానికి పెరిగింది. వచ్చే ఏడాది ఇది 60 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ అంచనావేస్తున్నది. అలాగే సిమెంట్ కంపెనీ నిర్వహణ లాభాలు కూడా 1-3 శాతం వరకు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది.