న్యూఢిల్లీ, జూన్ 28: మొబైల్ సబ్స్ర్కైబర్లకు టెలికం సంస్థలు వరుసగా షాకిస్తున్నాయి. ఇప్పటికే టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ టారిఫ్ చార్జీలను పెంచగా.. తాజాగా ఇదే జాబితాలోకి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా చేరాయి. ఈ రెండు సంస్థలు కూడా తమ ప్లాన్ల ధరలను కూడా పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. ఎయిర్టెల్ చార్జీలు వచ్చే నెల 3 నుంచి అమలులోకి రానుండగా, అదే వొడాఫోన్ ఐడియా చార్జీలు మాత్రం జూలై 4 నుంచి అమలులోకి రానున్నాయి.
నష్టాల్లో నడుస్తున్న వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల 4 నుంచి అమలులోకి వచ్చేలా చార్జీలను 11 శాతం నుంచి 24 శాతం వరకు సవరించింది. ఎంట్రీ-లెవల్ ప్లాన్ కనీస చార్జీని 11 శాతం పెంచడంతో ఈ ప్లాన్ ధర రూ.179 నుంచి రూ.199కి చేరుకున్నది. అలాగే ప్రజాదరణ పొందిన 84 రోజుల కాలపరిమితి ప్లాన్ని రూ.719 నుంచి రూ.859కి పెంచింది. మరోవైపు రూ.2,899 వార్షిక ప్లాన్ చార్జీని 21 శాతం పెంచడంతో రూ.3,499కి చేరుకున్నది.