Groww App | ముంబై, జూన్ 29: తాను పెట్టుబడి పెట్టానంటూ ఓ మదుపరి.. అంతలేదని గ్రో యాప్ పరస్పర వాగ్వాదానికి దిగుతున్నాయి. యాప్ ద్వారా తాను ఓ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకంలో పెట్టుబడి పెట్టినట్టు కనిపిస్తున్నదని, కానీ దాన్ని తిరిగి ఉపసంహరించుకోలేకపోతున్నానని సదరు ఇన్వెస్టర్ చెప్తుండగా.. అసలు అంతలా ఎంఎఫ్ లావాదేవీనే జరుగలేదని గ్రో యాప్ కొట్టిపారేస్తున్నది.
మదుపరి చెప్తున్నదిది..
2020లో గ్రో యాప్ ద్వారా పరాగ్ పరీఖ్ మ్యూచువల్ ఫండ్ స్కీంలో తన సోదరి పెట్టుబడి మొదలుపెట్టిందని హనేంద్ర ప్రతాప్ సింగ్ ఓ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. లావాదేవీ విజయవంతమైనట్టు ఓ ఫోలియో నంబర్ కూడా వచ్చిందని తెలిపారు. గ్రో యాప్ కూడా ఇప్పటిదాకా పెట్టుబడి మొత్తాన్ని చూపించిందని, ఇతర ఫండ్స్ మాదిరిగానే అన్ని వివరాలను అందించిందని తెలియజేశారు. అయితే తమ పెట్టుబడిని ఆశించిన స్థాయిలో తిరిగి తీసుకుందామంటే కుదరట్లేదని వాపోయారు. దీనికి కారణం ఏంటని గ్రో కస్టమర్ కేర్ను సంప్రదించినా ఫలితం లేకపోయిందని సింగ్ అంటున్నారు.
గ్రో యాప్ వైపు నుంచి..
ఈ వివాదంపై గ్రో యాప్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక్కడ ఎలాంటి మోసానికి తావులేదన్నది. సదరు కస్టమర్ దగ్గర్నుంచి పేర్కొంటున్న మొత్తంలో నగదు అందలేదని, రీక్యాన్సిలేషన్ సమస్య వల్ల ఇన్కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చూపుతున్నదని వెల్లడించింది. గ్రో యాప్ వివరాల ప్రకారం.. తొలుత 2020 సెప్టెంబర్ 25న రూ.10,000 పెట్టుబడి సదరు మదుపరి పెట్టారు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ఐఎస్ఐపీ వేదికతో నేరుగా లింకైన ఓ బ్యాంక్ ద్వారా ఈ లావాదేవీ జరిగింది. దీని ఆర్డర్ ఐడీ 1XXXXXXX6. 2022 జూన్ 27న మరో ఫోలియో నుంచి రూ.50,000 లావాదేవీ జరిగింది. కానీ ఐడీ మాత్రం ఇదే (1XXXXXXX6). ఈ క్రమంలోనే తమ సిస్టమ్లో ఐడీ 1XXXXXXX6పై రూ. 10వేల పెట్టుబడికి బదులు తర్వాత వచ్చిన రూ.50వేల పెట్టుబడే కనిపిస్తున్నదని గ్రో యాప్ పేర్కొన్నది. కానీ ఆ మొత్తం తమకు ఇప్పటికీ అందలేదని చెప్పింది. కాబట్టి మోసపోయామని ఆరోపిస్తున్న కస్టమర్ అసలు పెట్టుబడి రూ.10వేలేనని గ్రో యాప్ చెప్తున్నది. బీఎస్ఈ నుంచి కూడా తమకు ఇదే ధ్రువీకరణ వచ్చిందన్నది.