న్యూఢిల్లీ, జూన్ 25: స్పెక్ట్రం వేలానికి టెలికం సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు నిర్వహించిన ఐదు రౌండ్లలో రూ.11 వేల కోట్ల విలువైన వాయుతరంగాలకు బిడ్లుదాఖలయ్యాయని తెలుస్తున్నది. ఈసారి నిర్వహిస్తున్న 10,500 మెగాహెట్జ్ స్పెక్ట్రం వేలం ద్వారా రూ.96,238 కోట్ల నిధులు సమకూరవచ్చునని కేంద్రం అంచనావేసింది. ఈ వేలం రెండోరోజు బుధవారం కూడా కొనసాగనున్నది. తొలి రోజు నిర్వహించిన 900, 1800 మెగాహెట్జ్ బాండ్స్ వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి.
హైదరాబాద్, జూన్ 25: దక్షిణాదిలో రెండో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంఐపీపీఎల్)…నూతన బ్రాండ్ ‘ఎంఎస్ వాయు’ను మార్కెట్కు పరిచయం చేసింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో అభిశేక్ అగర్వాల్ మాట్లాడుతూ..వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి వచ్చే ఐదేండ్లలో రూ.2 వేల కోట్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి దక్షిణాదితోపాటు పడమర భారతంలో తన ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థ..వచ్చే ఐదేండ్లలో ఉత్తర, తూర్పు భారతానికి విస్తరించనున్నట్లు, ఇందుకోసం కొత్తగా స్టీల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం వచ్చే రెండేండ్లలో ఐపీవోకి రాబోతున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, జూన్ 25: డెయిరీ స్టార్టప్ సిద్స్ ఫార్మ్..వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే నిధుల్లో 10 మిలియన్ డాలర్ల(రూ.83 కోట్లు)ను పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ఈ నిధులతో హైదరాబాద్తోపాటు బెంగళూరులలో ఉన్న పాల ఉత్పత్తుల కేంద్రాల సామర్థ్యాన్ని పెంచడానికి వినియోగించనున్నట్లు కంపెనీ ఫౌండర్ కిశోర్ ఇందుకూరి తెలిపారు. అధిక నాణ్యత పాల ఉత్పత్తులకు పెరగనున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2016లో హైదరాబాద్ కేంద్రంగా పాల ఉత్పత్తుల సేవలను ఆరంభించిన సంస్థకు ప్రస్తుతం ఈ రెండు నగరాల్లో 25 వేల మంది కస్టమర్లు ఉన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 25: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకున్నది. తన ప్రీమియం బైకులు జావా మాడళ్ల ధరలను రూ.15 వేల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది తొలినాళ్లలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన క్లాసిక్ 350, జావా 350 మాడళ్లు రూ.2.14 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నాయి. దీంతో జావా 350 బైకు ధర రూ.2,14,950 నుంచి రూ.1,98,950కి దిగొచ్చింది. ఈ బైకు 334 సీసీ సామర్థ్యంతో రూపొందించింది.
న్యూఢిల్లీ, జూన్ 25: ఈ ఏడాదిలో ఎఫ్ఎంసీజీ రంగం 7-9 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నదని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ రంగానికి ప్రభుత్వం అండదండగా ఉండటం, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొంది. అయినప్పటికీ ఈ రంగం పలు సవాళ్లను ఎదుర్కొనున్నదని, ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఒత్తిడి, కొనుగోలుదారుల్లో విశ్వాసం కోల్పోవడం, నిరుద్యోగం అధికంగా ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది.