హైదరాబాద్, జూన్ 26: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలికసదుపాయాల సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అతిపెద్ద కాంట్రాక్ట్ను దక్కించుకున్నది. కర్ణాటకలోని కైగా వద్ద 1400 మెగవాట్ల ఎలక్ట్రికల్ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐఎల్) పిలిచిన టెండర్లలో మేఘా ఇంజినీరింగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈపీసీ పద్దతిన నిర్మించనున్న ఈ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ భారీ కాంట్రాక్టును మేఘా దక్కించుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అణు ఇంధనశాఖ పరిధిలోని ఎన్పీసీఐఎల్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) పద్దతిలో ఈ రియాక్టర్ల నిర్మాణానికి గతేడాది మే నెలలోనే టెండర్లను పిలిచింది. ఈ బిడ్లను బుధవారం తెరిచారు. ఈ బిడ్లో తక్కువ కోట్ చేసిన మెయిల్ తొలి స్థానంలో నిలిచినట్లు కంపెనీ డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్య తెలిపారు. ఈ టెండర్ ప్రక్రియలో ఎల్అండ్టీ, భెల్ కూడా పాల్గొన్నాయి. ఈ రెండు సంస్థలు కూడా ఎక్కువ కోట్ చేయడంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయన్నారు. కానీ, మేఘా ఇంజినీరింగ్ రూ.12,799.92 కోట్ల ధరను కోట్ చేసి ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకోవడంతో సంస్థ అణు ఇంధన రంగంలోకి అడుగుపెట్టినట్లు అయిందని, ఇదొక మైలురాయి అన్నారు.