న్యూఢిల్లీ, ఆగస్టు 1: జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జూలై నెలకుగాను రూ.1.82 లక్షల కోట్ల వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 10 శాతం అధికం. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మూడో అతిపెద్ద వసూలు ఇదే కావడం విశేషం. అలాగే రూ.16,283 కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది. నికరంగా లెక్కిస్తే రిఫండ్ చెల్లింపులు జరిపిన తర్వాత రూ.1.66 లక్షల కోట్లు జీఎస్టీ వసూలయ్యాయి.
మరోవైపు, ఏప్రిల్లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు జీఎస్టీ చరిత్రలో అత్యధిక వసూళ్లు ఇదే కావడం విశేషం. గత నెలకుగాను వసూలైన రూ.1,82,075 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.32,386 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.40,289 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.96,477 కోట్లు వసూలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.4,940 కోట్ల మేర వసూలయ్యాయని పేర్కొంది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో రూ.4,849 కోట్లతో పోలిస్తే ఇది 2 శాతం అధికం. అలాగే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం తగ్గి రూ.3,593 కోట్ల నుంచి రూ.3,346 కోట్లకు తగ్గాయి.